Begin typing your search above and press return to search.

మూడుకు ముహూర్తం...బిల్లు రెడీ

By:  Tupaki Desk   |   2 Dec 2021 11:30 PM GMT
మూడుకు ముహూర్తం...బిల్లు రెడీ
X
ఏపీలో మూడు రాజధానుల విషయానికి ఇంటర్వెల్ మాత్రమే అని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్యనే చెప్పారు. క్లైమాక్స్ వరకూ వేచి చూడాలని ఆయన బిగ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇపుడు మరో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మూడు రాజధానుల బిల్లు విషయం తేల్చేశారు. తప్పకుండా బిల్లుని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన లేటెస్ట్ గా మాట్లాడుతూ స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు సభ ముందుకు రావడం ఖాయమని కూడా శ్రీనివాసరెడ్డి ముహూర్తం కూడా చెప్పేశారు.

అంటే మరో నాలుగు నెలలలో మూడు రాజధానుల సవరణ బిల్లు సభ ముందుకు వస్తుంది అన్న మాట. మరి అది ఏ రూపంలో ఉంటుంది. పాత బిల్లుకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, అదనంగా కొన్ని చేరుస్తారా అన్న దాని మీద చర్చ అయితే వేడిగానే సాగుతోంది. దీని మీద ఈ మధ్యనే మరో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నవి ఉంటాయి.దానికి కొత్తగా మరికొన్ని యాడ్ అవుతాయని హింట్ ఇచ్చారు. మరి అలా కొత్తగా జత చేరేవి ఏమై ఉంటాయి అన్నది కూడా ఆలోచించాల్సి వస్తోంది. మూడు రాజధానుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన స్టాండ్ ఏంటో చెప్పకున్నా ఏపీ బీజేపీ విధానమే తన విధానం అని చెబుతోంది.

ఈ మధ్యన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి వచ్చినపుడు అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు మద్దకుగా బీజేపీ వారిని కూడా పాలుపంచుకోమని చెప్పారు. ఇక ఏపీ బీజేపీ నేతలు అయితే అమరావతి మాత్రమే ఏపీలో ఏకైక రాజధానిగా ఉండాలని కుండబధలు కొడుతున్నారు. ఇక మూడు రాజధానులు అంటే టెక్నికల్ గా ఎన్నో సమస్యలు వస్తాయి. అది మొదటి సారి చట్టం చేసినపుడే తెలిసింది. మరి దాన్ని మారి సవరించిన బిల్లుని సభలో ప్రవేశపెడితే ఎలా ఈ టెక్నికల్ పాయింట్స్ ని అధిగమిస్తారు అన్న చర్చ కూడా ఉంది.

అయితే కొత్త బిల్లులో మూడు రాజధానులు అన్న ప్రశ్న లేకుండా ఉంటుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. రాజధాని అంటేనే సమస్య వస్తుంది. అలా కాకుండా వేరే విధంగా పేర్కొంటూ అభివృద్ధిని అన్ని చోట్లకు వికేంద్రీకరించడం, పాలనను అన్ని చోట్లా పంచడం చేయడం ద్వారా వైసీపీ ఈ సమస్యని దాటేస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా మూడు రాజధానులు అంటూ కనుక వైసీపీ బయటకు చెప్పినా బిల్లులో అలా ఉంచినా పాత సమస్యలనే కొత్తగా ఎదుర్కోవడం తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. మరో వైపు చూసుకుంటే అమరావతిని అలా ఉంచుతూనే అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే కచ్చితంగా మూడు మూడ్ నుంచి సర్కార్ బయటపడుతుంది అన్న మేధావుల సలహాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి బడ్జెట్ సెషన్ లో వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో. ఆ కధా కమామీషూ ఏంటో.