Begin typing your search above and press return to search.

న‌యీం గ్యాంగ్‌...తాజా బెదిరింపు ఇది

By:  Tupaki Desk   |   16 Jan 2017 6:15 AM GMT
న‌యీం గ్యాంగ్‌...తాజా బెదిరింపు ఇది
X
గ్యాంగ్‌ స్టర్ నయీం పోలీసుల ఎన్‌ కౌంటర్‌ లో హతమైనంద‌ని మ‌న‌కు తెలుసు. కానీ అతని ముఠాకు చెందిన సభ్యులు హ‌ల్ చ‌ల్ చేస్తున్నార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. డబ్బులను కూడబెట్టుకునేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకుని లెక్కకుమిక్కిలి నేరాలకు పాల్పడిన త‌మ బాస్ న‌యీం రీతిలోనే ఈ అనుచ‌రులు కూడా నిజామాబాద్ జిల్లాలో సంచరిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. డిచ్‌పల్లికి చెందిన జడ్పీటిసి అరుణ భర్త - రియల్ ఎస్టేట్ వ్యాపారి అమృతాపూర్ గంగాధర్‌ ను ఇప్పటికే న‌యీమ్ ముఠా కోటి రూపాయల డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతం వెలుగులోకి రాగా, ఇదే తరహాలో మరికొందరు ప్రముఖ వ్యాపారులను కూడా నయీం అనుచరుల పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆలస్యంగా వెలుగుచూసింది.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిరికొండ మండలానికి చెందిన ఇద్దరు వ్యాపారులను అర్షద్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను నయీం ముఠా సభ్యుడినని - 30లక్షల రూపాయల చొప్పున డబ్బులు తెచ్చి ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేశాడు. బాధితులు కొంత ఆలస్యంగా పోలీసులకు సమాచారం అందించడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నయీమ్ ఆగస్టు మొదటి వారంలోనే షాద్‌ నగర్ వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో హతమయిన సంగ‌తి తెలిసిందే. అయితే అక్టోబర్ 26వ తేదీన సిరికొండ మండలం కొండూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ షోరూమ్ యజమాని రాంరెడ్డికి గుర్తు తెలియని నెంబరు నుండి నయీం ముఠా సభ్యుడి పేరుతో ఫోన్‌ కాల్ వచ్చింది. 30లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వాలని, లేనిపక్షంలో నిన్ను - నీ కుటుంబ సభ్యులను హతమారుస్తామంటూ సదరు వ్యక్తి బెదిరించాడు. అయితే రాంరెడ్డి ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ గురించి ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయాడు. తన కుటుంబ సభ్యులు - మిత్రుల సూచన మేరకు ఎట్టకేలకు గత వారంపది రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించి బెదిరింపు ఫోన్ కాల్ గురించి ఫిర్యాదు చేశాడు. దీనికి కొద్దిరోజుల ముందు సిరికొండ మండల కేంద్రానికే చెందిన ఎల్‌ ఐసి ఏజెంట్‌ గా వ్యవహరిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వర్తించే గంగాదాస్ అనే వ్యక్తికి కూడా గత సెప్టెంబర్ 30వ తేదీన నయీం ముఠా సభ్యుడి పేరుతో ఫోన్ ద్వారా బెదిరింపు కాల్ వచ్చింది. 30లక్షల రూపాయలు ముట్టజెప్పాలని, లేనిపక్షంలో అంతుచూస్తామంటూ అర్షద్ అనే వ్యక్తి ఫోన్‌లో బెదిరించాడని బాధితుడు గంగాదాస్ నవంబర్ 1వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యాపారులు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని సిరికొండ ఎస్‌ ఐ వి.ఉపేందర్‌ రావు నిర్ధారించారు. కేసు నమోదు చేసి వారికి వచ్చిన బెదిరింపు కాల్ గురించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. నెట్‌ వర్క్ ప్రొవైడర్ నుండి డేటా అందాల్సి ఉందని, పండగ సెలవులు కావడంతో డేటాను తమకు అందించడంలో కొంత జాప్యం జరుగుతోందని, సమాచారం అందిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

కాగా, ఒకే మండలానికి చెందిన ఇద్దరు వ్యాపారుల పూర్తి వివరాలను పక్కాగా సేకరించి, వారికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తే ఈ ముఠాకు చెందిన సభ్యులు స్థానికంగానే ఉండి ఆర్థికంగా పలుకుబడి కలిగిన వారి గురించి ఆరా తీసినట్టు భావిస్తున్నారు. గతంలోనూ డిచ్‌ పల్లి వ్యాపారి గంగాధర్‌ ను కూడా ఇదే తరహాలో గంగాధర్ సతీమణి డిచ్‌ పల్లి జడ్పీటిసిగా కొనసాగుతున్న విషయంతో పాటు అతని ఇద్దరు కుమారుల్లో ఒకరు హైదరాబాద్‌ లో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు జర్మనీలో ఉంటున్న విషయాన్ని వెల్లడించడం, గంగాధర్ ఇప్పటివరకు ఎక్కడెక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహించాడు, అతని కుటుంబం పేరిట ఉన్న స్థిర, చరాస్థుల వివరాలన్నీ నూటికి నూరు శాతం పక్కాగా వెల్లడించడాన్ని బట్టి చూస్తే నయీం ముఠాకు చెందిన సభ్యులు రెక్కీ నిర్వహించి మరీ పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. కరడుగట్టిన తీవ్రవాది తరహాలో పాశావిక చర్యలకు పాల్పడుతూ నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పిన నయీం ఆచూకీని పక్కా సమాచారం మేరకు తెలుసుకుని అతనిని ముట్టుబెట్టినప్పటికీ, ముఠా సభ్యుల పేరుతో వ్యాపారులకు బెదిరింపు కాల్స్ వస్తుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/