Begin typing your search above and press return to search.

ఇదే...త‌హ‌శీల్దార్ దారుణ హత్య‌కు అస‌లు కారణం

By:  Tupaki Desk   |   5 Nov 2019 6:55 AM GMT
ఇదే...త‌హ‌శీల్దార్ దారుణ హత్య‌కు అస‌లు కారణం
X
అబ్దుల్లాపూర్‌మెట్ తహ‌శీల్దార్‌ కార్యాలయంలో...ప‌ట్టప‌గ‌లే ఎమ్మార్వోను పెట్రోల్ పోసి చంపిన ఘ‌ట‌న షాక్‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్‌ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భోజనవిరామ సమయంలో విజయారెడ్డి చాంబర్‌లోకి వచ్చిన సురేశ్‌ అనే రైతు.. సీట్లో కూర్చున్న ఆమె పై తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో సిబ్బంది రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమెకు నిప్పటించిన రైతు సైతం మంటల్లో 60 శాతం కాలిపోయాడు. గాయాలతోనే అతడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భూమికి సంబంధించిన వివాదంలో అవతలి పార్టీ నుంచి డబ్బులు తీసుకొని తనకు అన్యాయం చేస్తున్నారన్న కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితుడు సురేశ్‌ పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు.

సురేశ్ చేసిన ఈ క్రూర చ‌ర్య వెనుక‌...భూ వివాదం ఉండ‌టం విస్మ‌య‌క‌రంగా మారింది. రంగారెడ్డి జిల్లాఅబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం రెవెన్యూ గ్రామం పరిధిలోని గౌరెల్లికి చెందిన నిందితుడు కూర సురేశ్‌ తండ్రి కృష్ణతోపాటు మరో 36 మంది రైతులు 31 ఏళ్ల‌ క్రితం.. 1988లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం గ్రామ పరిధిలోని 96, 97 సర్వేనంబర్లలో 137 ఎకరాల పట్టాభూమిని కొనుగోలుచేశారు. అక్కడ తన తండ్రి పేరిట ఉన్న భూమిని తనకు అనుకూలంగా మార్చాలంటూ గత కొంతకాలంగా త‌హ‌శీల్దార్‌ విజయారెడ్డిపై సురేశ్‌ పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆ సర్వేనంబర్లలోని ఇతర రైతులకు పాస్‌పుస్తకాలు ఇచ్చి, తనకు ఎందుకు ఇవ్వడం లేదని సురేశ్‌ పలుమార్లు విజయారెడ్డితో వాదులాటకు దిగగా.. కోర్టు కేసు నేపథ్యంలో పాస్‌పుస్తకాలు జారీచేయలేనని అతనికి తెలిపినట్టు స‌మాచారం. అయితే ఈ పాస్‌పుస్తకాల జారీవెనుక కొంతమంది బడాబాబుల హస్తం ఉన్నదని, కొందరికే పాస్‌పుస్తకాలు ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడం వెనుక భారీమొత్తంలో డబ్బు చేతులు మారినట్టు గౌరెల్లి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ఈ వ్యవహారంపై సురేశ్‌, మరికొందరు చర్చించుకొని తమకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా ప్రతిఘటించాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఈ కారణంగానే సురేశ్‌ ఉన్మాదంతో విజయారెడ్డి హత్యకు తెగబడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే, ఈ భూమిపై సురేశ్ తండ్రి కృష్ణ‌కు హ‌క్కులు లేన‌ట్లు తెలుస్తోంది. కృష్ణ భూమిపై అనుభ‌వ‌దారుడిగా తనకు హక్కులున్నాయంటూ హబీబ్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదం కొనసాగుతుండగానే తనకు పాస్‌పుస్తకం ఇవ్వాలని సురేశ్‌ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కేసు కోర్టులో ఉన్నందున సురేశ్‌కు పాస్‌పుస్తకం జారీచేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత హబీబ్‌ వద్ద ఉన్న భూ రికార్డులను కోర్టు పరిశీలించి అతనికి అనుకూలంగా తీర్పునివ్వడంతో హబీబ్‌కు పాస్‌పుస్తకాన్ని జారీచేసేందుకు జాయింట్‌ కలెక్టర్‌ ఉత్తర్వు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అప్పటినుంచి నిందితుడు సురేశ్‌.. తనకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పాస్‌ పుస్తకం ఇచ్చిందని, ఇప్పుడు ఎందుకు ఇవ్వరని అధికారులను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. అప్పటిదాకా కబ్జాలో ఒకరు.. పట్టాదార్‌ కాలమ్‌లో మరొకరు వస్తున్నందున పట్టాదారులకే పాస్‌పుస్తకాలు జారీచేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో కబ్జాదార్‌ కాలమ్‌లో ఉన్న కృష్ణకు పాస్‌పుస్తకం జారీచేసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో సురేశ్ ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు.

కాగా, అబ్దుల్లాపూర్‌మెట్ తహ‌శీల్దార్‌ విజయారెడ్డి హత్యను రంగారెడ్డి జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ హరీశ్‌ తీవ్రంగా ఖండించారు. ఆ భూ వివాదం తహ‌శీల్దార్‌ పరిధిలోని అంశమే కాదని, అయినప్పటికీ పట్టదార్‌ పాస్‌పుస్తకం కోసం ఆమెపై సురేశ్‌ పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడని హరీశ్‌ పేర్కొన్నారు. విజయారెడ్డికి సంబంధం లేకున్నా ఆమెను దారుణంగా హత్యచేయడాన్ని కలెక్టర్‌ తప్పుపట్టారు.