Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సంక‌ల్పం ఇదే.. మారుతున్న వ్యూహం

By:  Tupaki Desk   |   20 April 2022 11:13 AM GMT
చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సంక‌ల్పం ఇదే.. మారుతున్న వ్యూహం
X
ఏపీ మాజీ ముఖ్యమంట్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు... త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రోజు ఆయ‌న‌ 73వ ఏట అడుగుపెట్టారు. గత పుట్టిన రోజులకు భిన్నంగా ఈసారి ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇందుకోసం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలగొల్లగూడెం గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నెక్కలంగొల్లగూడెం గ్రామానికి చేరుకుంటారు. కొందరి ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. స్థానికులతో సహపంక్తి భోజనం చేస్తారు.

పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేసేలా చంద్రబాబు కార్యాచరణ రూపొందించుకున్నారు. ధరల మోత, పన్నుల భారంతో ప్రజలు పడుతున్న అవస్థలపై పోరాటంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ.. శ్రేణులను మమేకం చేయనున్నారు. ఇవాళ పుట్టినరోజును ప్రజల మధ్య నిర్వహించుకోవడం ద్వారా.. ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మే మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో పర్యటనలు మొదలుకానున్నాయి. మహానాడు తర్వాత ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున.. ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

రోడ్డు షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలా, గ్రామ సభలు నిర్వహించాలా అనే అంశంపై పార్టీ నాయకులతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. జ‌గ‌న్‌.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై వేసిన వివిధ రకాల భారాలపై 'బాదుడే బాదుడు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి.. ప్రజలకు కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు నిర్వహించాలని మొదట అనుకున్నా, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో.. మహానాడు వరకు కొనసాగించాలని నిర్ణయించారు.

దానిలో భాగంగా మే నెలలో కొన్ని నియోజకవరాలకు చంద్రబాబు వెళ్లనున్నారు. మే మొదటి వారంలో కుప్పంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. చంద్రబాబు ప‌ర్యట‌న‌లకు సమాంతరంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్ కూడా ప్రజల మధ్య ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ ఏడాది ఆగస్టు నుంచి పాదయాత్ర ద్వారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఏదేమైనా.. వ‌చ్చే రెండేళ్ల‌పాటు... పార్టీని పుంజుకునేలా చేయాల‌న్ని..చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సంక‌ల్పంగా సీనియ‌ర్లు చెబుతున్నారు.