Begin typing your search above and press return to search.

అమరావతి స్కాం: సుప్రీంలో ఏపీ ప్రభుత్వ వాదన ఇదీ

By:  Tupaki Desk   |   13 July 2021 11:00 PM IST
అమరావతి స్కాం: సుప్రీంలో ఏపీ ప్రభుత్వ వాదన ఇదీ
X
చంద్రబాబు హయాంలో అమరావతి భూముల స్కాం జరిగిందని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో గట్టిగా వాదించారు. పలు ఆధారాలు చూపించారు. ఈ క్రమంలోనే దీనిపై సీఐడీ సిట్ విచారణ జరిపి నిగ్గుతేల్చారు. అయితే హైకోర్టు ఈ విచారణపై స్టే విధించింది. దీంతో చాలా రోజుల తర్వాత దీనిపై సుప్రీంకోర్టుకు ఎక్కింది ఏపీ ప్రభుత్వం.

తాజాగా అమరావతి భూములపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ భూముల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని.. విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టు స్టే ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఈ కేసు పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. ఏపీ ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదించారు. ‘అమరావతిలో రాజధాని పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని.. దీనిపై సీబీఐ లేదా రిటైర్డ్ జడ్జితో లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని' గట్టిగా వాదించారు.ఈ కేసుపై లోతైన విచారణ నిమిత్తం హైకోర్టుకు పంపాలని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోరడం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టుకు ఎక్కి మళ్లీ హైకోర్టులో విచారణకు కోరడం గమనార్హం.

అయితే ఇదంతా కల్పితమైన, రాజకీయ కుట్రపూరిత కేసు అని.. ఈ వ్యవస్థ ప్రతీకారం ఇంకా ఎన్నాళ్లంటూ ఏపీ ప్రభుత్వంపై ప్రత్యర్థి వర్గం ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు.సుప్రీంకోర్టు వాదనలు విని ఈనెల 22కు విచారణను వాయిదా వేసింది. అమరావతి భూముల స్కాంపై సుప్రీంకోర్టు ఏం తీర్పునిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హైకోర్టు దీన్ని కొట్టివేయగా.. ఇప్పుడు సుప్రీం నిర్ణయం ఆసక్తి రేపుతోంది.