Begin typing your search above and press return to search.

ఆ రకంగా దొంగలకు హెల్ప్‌ చేసిన చంద్రబాబు!

By:  Tupaki Desk   |   19 Aug 2016 11:06 AM GMT
ఆ రకంగా దొంగలకు హెల్ప్‌ చేసిన చంద్రబాబు!
X
కృష్ణా పుష్కరాలు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వరుస సెలవులు - శ్రావణ పౌర్ణమి - జనసమ్మర్దం ఉండే రోజులు చాలా వరకు పూర్తయిపోయిన తరువాత.. విజయవాడలో పోలీసులు పెద్దసంఖ్యలో జేబుదొంగలు చిల్లర దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. రద్దీగా ఉన్న పుష్కర ఘాట్లలో వీరు చేతివాటం ప్రదర్శిస్తూ వచ్చారన్న మాట. అయితే వీరు దొంగతనాలకు పాల్పడిన తీరు తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.

విజయవాడలో పుష్కరాల హడావుడిలో భక్తులనుంచి చోరీలకు పాల్పడుతున్న 16 ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిదో రోజు వరకు ఏం చేస్తున్నారనే సంగతి పక్కన పెడితే.. ఈ ముఠాల్లో మొత్తం 48 మహిళలతో సహా - 115 మంది ఉన్నారట. అంటే ఎడాపెడా చేతివాటం చూపిస్తూ వచ్చారన్నమాట. బీహార్‌ - మహారాష్ట్ర - కర్ణాటక - తమిళనాడు ల నుంచి దొంగలు వచ్చి ఈ చోరీలు చేస్తున్నట్లుగా గుర్తించారు.

వీరి దొంగతనాల పద్ధతి ఏంటంటే.. స్నానం చేసి వచ్చిన భక్తులకు దురద కలిగేలాగా వారి మీద పౌడరు చల్లుతారట. వారు దురద హడావుడిలో ఉండగా.. వీరి తస్కరించే పని పూర్తి చేస్తారు.

కృష్ణా నదిలో స్నానం చేస్తే దురదలు వస్తాయని పుష్కరాలకు ముందునుంచే జనంలో ఒక భయం వచ్చింది. కృష్ణా జలాల్లో ఈలి అనే బ్యాక్టీరియా ఉందని - దురదలు వస్తాయని ప్రచారం సాగింది. దానికి తోడు చంద్రబాబునాయుడు బ్యాక్టీరియా గురించి.. అనవసరపు ప్రచారం చేస్తున్నారంటూ.. తాను పదేపదే హెచ్చరించి.. ప్రజల్లో మరింత భయాన్ని పెంచారు. బ్యాక్టీరియా మరియు దురదల గురించి ప్రజల్లో ఎటూ అనుమానం ఉన్నది గనుక.. ఆ దురదల మార్గాన్ని దొంగలు వాడుకున్నారు. బ్యాక్టీరియా గురించి జరిగిన విస్తృత ప్రచారం - చంద్రబాబు దాన్ని హైలైట్‌ చేయడం అంతా కలిసి దొంగలకు దారి చూపించిందని జనం నవ్వుకుంటున్నారు.