Begin typing your search above and press return to search.

హై కోర్టునే మోసం చేశారా ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 5:26 AM GMT
హై కోర్టునే మోసం చేశారా ?
X
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయటం మామూలే. కక్షిదారుల తరపున ఎవరో లాయర్లు ఈ కేసులు వేస్తారు. అలాగే కొన్ని కేసుల్లో లాయర్లు కూడా నేరుగా కేసులు వేస్తారు. కానీ అసలు కక్షిదారులకే సంబంధం లేకుండా వారి పేర్లతో కేసులు వేయచ్చా ? ఒకవేళ అలా వేసిన కేసులను ఏమంటారు ? కక్షిదారుల పేర్లతో కేసులు వేసిన లాయర్లను న్యాయమూర్తులు ఏ విధగా పరిగణిస్తారు ? ఇప్పుడిదంతా ఎందుకంటే ఇపుడు జరిగింది ఇదే కాబట్టి.

పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు చేసుకునేట్లుగా ప్రభుత్వం పథకాన్ని తెచ్చింది. ఇందులో భాగంగా లబ్దిదారులకు తలా సెంటు భూమిని కేటాయించింది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కూడా మొదలైంది. ఇంతలో హఠాత్తుగా తెనాలికి చెందిన పొదిలి శివమురళి అండ్ 120 మంది పేరుతో హైకోర్టులో కేసు దాఖలైంది. తమకు ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్ధలం ఏమాత్రం సరిపోదని ఇంకా విశాలమైన స్ధలం కావాలంటు కేసు వేశారు.

పిల్ ను విచారించిన హైకోర్టు వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం కేటాయించిన సెంటున్నర స్ధలం ఏమాత్రం సరిపోదన్న వాదనతో ఏకీభవించింది. వెంటనే ఇళ్ళ నిర్మాణాలు నిలిపేయాలని ఆదేశించింది. దాంతో 31 లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇళ్ళ స్ధలాలు కేటాయిస్తే చాలాచోట్ల ఇళ్ళ నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇపుడు కోర్టు ఆదేశాలతో అన్నీ నిర్మాణాలు ఆగిపోయాయి. కోర్టు ఆదేశాలను చూసిన వాళ్ళు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇంటిస్ధలాలు పంపిణీ చేసినా ఇచ్చేది సెంటు, సెంటున్నర స్ధలమే.

సీన్ కట్ చేస్తే అసలు విషయం బయపడింది. ఇంతకీ అదేమిటంటే ఎవరిపేర్లతో అయితే కోర్టులో కేసులు దాఖలయ్యాయో అవేవీ కక్షిదారులకు తెలీదు. అంటే పొదిలి శివమురళి అండ్ 120 మందికి తెలీకుండానే ఇంకెవరో వాళ్ళపేర్లతో కేసులు వేశారు. గతంలో ఎప్పుడో వీళ్ళిందరికీ ఇళ్ళస్ధలాలు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డు సహా వివరాలు తీసుకున్న వాళ్ళు ఆ వివరాలను కోర్టులో కేసులు దాఖలు చేయటానికి ఉపయోగించుకున్న విషయం అర్ధమైపోతోంది. తమ పేర్లతో కోర్టులో కేసు వేసిన విషయం బయటకు వచ్చేసరికి కక్షిదారులంతా లబోదిబో మంటున్నారు.

తమ భార్యలు, కుటుంబ సభ్యుల పేర్లతో కూడా ఇంటిస్ధలాలు మంజూరైనపుడు తామెందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తామని మొత్తుకుంటున్నారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే కోర్టులో ఎవరో తప్పుడు కేసు వేశారని. మరి కక్షిదారులకే తెలియకుండా వారిపేర్లతో కేసులు వేసిన లాయర్ విషయంలో కోర్టు ఏమి చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. గతంలో తాము దళారుల చేతిలో మోసపోయినపుడు పోలీసు స్టేషన్ కే వెళ్ళలేని తాము ఇపుడు కోర్టుకు ఎలా వెళతామని కక్షిదారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎవరో కోర్టునే తప్పుదోవపట్టించినట్లు అర్ధమైపోయింది. చూద్దాం ఏమవుతుందో.