Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే క్రూరమైన వాళ్లు వీల్లేనా?

By:  Tupaki Desk   |   3 July 2020 12:30 AM GMT
ప్రపంచంలోనే క్రూరమైన వాళ్లు వీల్లేనా?
X
ఈ ప్రపంచంలో అసలు క్రూరమైన వాళ్లు ఉన్నారా? చరిత్ర చూస్తే మాత్రం ఉన్నారు. వారే ప్రపంచంలోనే అత్యంత క్రూరులుగా ముద్రపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర తవ్వితీస్తే కొందరు నాయకులు ఆ దేశాలకు నాయకులుగా అధికారాన్ని చేజిక్కించుకొని ఒక నియంతలా మారి ఘోరంగా పాలించారు. లక్షలమందిని చంపారు. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయిన ముగ్గురు క్రూరమైన నాయకులే స్టాలిన్, హిట్లర్, చెంఘీజ్ ఖాన్.

* స్టాలిన్ రక్తాక్షరాలు

రష్యాని 30 సంవత్సరాలపాటు పాలించిన నియంత స్టాలిన్. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ ని వెంటాడి మరి వేటాడిన వ్యక్తి, లెనిన్ వారసత్వ పగ్గాలని అందుకొని తనకి అడ్డువచ్చిన అందరిని హతమారుస్తు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని ప్రగతి రంగంలోకి దూసుకుపోయేలా చేసిన అతడే జోసెఫ్ స్టాలిన్. 1928-29లో కరువు వచ్చినప్పుడు వ్యవసాయరంగంలో సమిష్టి కరణకై ఒక కోటి మంది రైతులు హతమార్చబడ్డారు. కొందరు సైబీరియాకు తరలించబడగా, మరికొందరు నిర్బంధ శిబిరాలలో చిత్రహింసలకు గురయ్యారు. కొందరు రైతుల్ని ఫ్యాక్టరీలకు తరలించి, పనిచేయించారు. యూరప్ లో ప్రజాస్వామిక దేశాలతో జర్మనీ యుద్ధం చేస్తుండగా స్టాలిన్ మరోవైపు లోగడ మొదటి ప్రపంచ యుద్ధంలో పోగొట్టుకున్న భూభాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు. తూర్పు పోలెండ్ ను నాశనం చేసిన స్టాలిన్, 15 వేల పోలీస్ అధికారులను హతమార్చాడు. 1939 సెప్టెంబరులో కుదుర్చుకున్న ఒప్పందం 1941 జూన్ 22 వరకు సాగింది. జర్మనీ కమ్యూనిస్టులను, యూదులను రష్యా చేతులారా హిట్లర్ కు అప్పగించగా వారంతా హత మార్చబడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్ చంపించిన వారి సంఖ్య రష్యాలో 5 లక్షల మంది అని తేలింది. ఇలా సోవియెట్ రష్యా అంత స్టాలిన్ వ్యాపించి దేవుడు లేని కమ్యూనిజానికి దేవుడై, తనని నమ్మనివాళ్ళకి మృత్యువైన నియంత స్టాలిన్.

* హిట్లర్.. నియంతకు మారుపేరు

ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన హిట్లర్.. జర్మనీని ప్రపంచంలో అగ్ర రాజ్యాంగ చూడాలని భావించి మొదటగా సైన్యంలో చేరి ఆ తరువాత సొంతంగా పార్టీ స్థాపించి జర్మనీ నేతగా ఎదిగి ఆ తరువాత రెండో ప్రపంచం యుద్ధం లో గెలిచి ప్రపంచానికి నియంత కావాలని ఆశించి రెండవ ప్రపంచ యుద్ధంలో తనకి ఓటమి తప్పదు అని భావించి శత్రువులకు చిక్కకుండా ఆత్మహత్య చేసుకొని మరణించిన వ్యక్తి హిట్లర్. అయితే హిట్లర్ కి మొదటినుండి కూడా యూదులు అంటే చాలా ద్వేషం ఉండేది. హిట్లర్ అధ్యక్షుడు అవ్వగానే సైన్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అతి క్రూరమైన కొన్ని నిర్ణయాలను తీసుకున్నాడు. అందులో, యూదులని పూర్తిగా నామరూపాలు లేకుండా అందరిని చంపించడం, అంగవైకల్యం, హోమోసెక్స్ వలన దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు వారిని చంపించేయడం, కమ్యూనిస్టులను చంపించేయడం, నాజిపార్టీ తప్ప ఏ ఇతర పార్టీలు ఉండకూడదు వంటి నిర్ణయాలను తీసుకున్నాడు. 1941లో 87 లక్షల యూదులు జర్మనీలో వున్నారు. ఇందులో 58లక్షల మందిని 1945 నాటికి హిట్లర్ చంపించగలిగాడు. తన మేధా శక్తితో జర్మనీ అధ్యక్షుడైన హిట్లర్, తన ఆలోచన వైఖరిని మార్చుకోకుండా జాతి వివక్షత కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం లో తన ఓటమికి ముందే ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

*విస్తరణ కాంక్షతో మరణమృదంగం వాయించిన చెంఘిజ్ ఖాన్

ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచారజాతికి చెందినవాడు చెంఘీజ్ ఖాన్. ఇతని అసలు పేరు టెమూజిన్. సంచారజాతికి చెందిన వారిని ఒక్కటిగా చేసి నాయకుడిగా మారి, వీరి పైకి ఎవరు దాడి చేసిన వారిని చంపుకుంటూ వచ్చి చివరకు ప్రపంచంలోనే అతి పెద్దదైన మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ప్రపంచ జనాభాలో దాదాపుగా 11 శాతం మంది జనాభాను చెంఘీజ్ ఖాన్ చంపేశాడని అందుకే ఇతడిని ప్రపంచంలోనే అత్యంత క్రూరుడని కొందరు అంటారు. మరికొందరు మాత్రం ప్రతి ఒక్కరికి మత స్వేచ్చని ఇచ్చి, స్త్రీలను అపహరించడం నిర్ములించాడని, తప్పు చేసిన వారిని చాలా ఘోరంగా చంపివేసేవాడని చెబుతారు. ఇక మంగోలియా దేశంలో చెంఘీజ్ ఖాన్ గుర్రం పైన ఉన్న విగ్రహం ఉండగా, ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఇదేనని చెబుతారు.

ఇలా ఇప్పటిదాకా చరిత్రలో అత్యంత క్రూరులైన ముగ్గురు నాయకులు వీరేనని చరిత్రకారులు చెబుతుంటారు.