Begin typing your search above and press return to search.

మీ కరెంటు బిల్లు కడితే సరిపోదు.. పక్కింటోళ్ల సంగతి చూడాలట

By:  Tupaki Desk   |   23 Aug 2021 2:19 AM GMT
మీ కరెంటు బిల్లు కడితే సరిపోదు.. పక్కింటోళ్ల సంగతి చూడాలట
X
మీ ఇంటి కరెంటు బిల్లు ఠంఛన్ గా కడితే సరిపోదా? పక్కింటోడు సైతం బిల్లు సకాలంలో కట్టారా? లేదా? అన్నది కూడా చూడాలా? అంటే అవునన్నట్లు ఉంది హైదరాబాద్ విద్యుత్ శాఖ ఉద్యోగుల తీరు చూస్తుంటే. మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏదైనా అపార్ట్ మెంట్లో.. ఒకరిద్దరు కరెంటు బిల్లు సకాలంలో చెల్లించకపోతే.. వారి కరెంటు కనెక్షన్ కట్ చేయాల్సింది పోయి.. మొత్తం అపార్ట్ మెంట్ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి రూల్ ప్రకారం చూస్తే.. ఎవరి కనెక్షన్ కు వారు మాత్రమే బాధ్యులు. వారి బిల్లుకట్టుకుంటే సరిపోతుంది. కానీ.. కొందరు ఉద్యోగుల అత్యుత్సాహంతో కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి ఇప్పుడు తెర మీదకు వచ్చింది. షేక్ పేట సత్య కాలనీకి చెందిన ఒక అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న ఒక కుటుంబం.. గడిచిన రెండేళ్లుగా విద్యుత్ బిల్లు కట్టటం లేదు. దీంతో.. సదరు వినియోగదారుడి బకాయి మొత్తం రూ.17వేలకు చేరుకుంది.

అతడు బకాయిలు చెల్లించకపోవటంతో ఏఈ షణ్ముక రెడ్డి.. లైన్ మన్ దీపక్ లు కలిసి తాజాగా బకాయిదారు ఉన్న అపార్ట్ మెంట్ మొత్తానికి కరెంటు సరఫరాను నిలిపివేస్తూ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. అపార్ట్ మెంట్లోని మిగిలిన వారు విద్యుత్ అధికారుల్ని సంప్రదించారు. తమ బిల్లు సకాలంలో కట్టేస్తున్నప్పుడు.. అపార్ట్ మెంట్ మొత్తానికి విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేస్తున్నారు? అని ప్రశ్నిస్తే.. మీ బిల్లు మీరు కడితే సరిపోదని.. అపార్ట్ మెంట్లో మిగిలిన వారి బకాయి కూడా బాధ్యత వహించాలని చెప్పిన అధికారుల మాటకు అవాక్కు అయిన పరిస్థితి. దీనిపై అపార్ట్ మెంటు వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై కాస్తంత ఫోకస్ పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం సారూ?