Begin typing your search above and press return to search.

అప్పుడు స్పీక‌ర్ భార్య‌.. ఇప్పుడు ఎమ్మెల్యే స‌తీమ‌ణి.. వేడెక్కిన‌ స్థానిక రాజ‌కీయం

By:  Tupaki Desk   |   28 Feb 2021 1:14 PM IST
అప్పుడు స్పీక‌ర్ భార్య‌.. ఇప్పుడు ఎమ్మెల్యే స‌తీమ‌ణి.. వేడెక్కిన‌ స్థానిక రాజ‌కీయం
X
రాష్ట్రంలో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌లు రాజ‌కీయంగా వేడెక్కించ‌డ‌మే కాదు.. చాలా ఆస‌క్తిగాను ఉంటున్నా యి.  ఎన్నిక‌ల్లో ఎవ‌రికివారు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సాక్షాత్తూ.. అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌తీమ‌ణి.. పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఇది రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తికర ఘ‌ట్టంగా త‌యారైంది. ఆమె ఆ ఎన్నిక‌ల్లో త‌న సొంత తోడికోడ‌లపై పోటీ చేసి.. విజ‌యం సాధించారు. ఇదో ఆస‌క్తిక‌ర విష‌యంగా రాజ‌కీయాల్లో నిలిచిపోయింది.

ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏకంగా ఓ ఎమ్మెల్యేగారి స‌తీమ‌ణి మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు. దీంతో స‌ద‌రు మునిసిపాలిటీలో రాజకీయం ఊపందుకుంది. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే స‌తీమ‌ణి పోటీ ప‌డుతున్న ఏకైక మునిసిపాలిటీ రాజ‌కీయంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి ఆ విశేషం ఏంటో.. ఎక్క‌డో.. ఏ ఎమ్మెల్యే స‌తీమ‌ణి రాజ‌కీయాల్లో నిల‌బ‌డ్డారో.. తెలుసుకుందామా?

క‌ర్నూలు జిల్లా నంద్యాల మునిసిపాలిటీలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య ఆస‌క్తిపోరు సాగుతోంది. ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కుడు, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌వి.. త‌న స‌తీమ‌ణి నాగిణిని నిల‌బెట్టారు. మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ గా ఆమెను చూసుకోవాల‌ని ఎమ్మెల్యే స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. దీంతో ఇక్కడ పోరు వైసీపీకి, ముఖ్యంగా ఎమ్మెల్యే శిల్పా ర‌వికి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. 130 ఏళ్ల‌కు పైగా చరిత్రను సొంతం చేసుకున్న నంద్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో ప్రత్యేక స్దానం ఉంది. స్పెషల్ గ్రేడ్‌  మున్సిపాలిటీగా కొనసాగుతున్న‌ నంద్యాల మున్సిపాలిటీకి ఆదాయం కూడా ఎక్కువే.

మునిసిపాలిటీ ప‌రిదిలో 42 వార్డులు ఉన్నాయి.  అధికార, ప్రతిపక్ష ‌పార్టీల నాయకులు 42 వార్డుల్లో గెలుపు పై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యే ఉన్న  శిల్పా ‌రవి 42 వార్డుల్లోనూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే శిల్పారవి స‌తీమ‌ణి నాగిణి రెడ్డిని ఛైర్మన్ అభ్యర్దిగా ప్ర‌క‌టించారు. అదేస‌మ యంలో టీడీపీ కూడా అన్నివార్డుల్లోనూ గెలిచి తీరుతామ‌ని చెబుతోంది. ఆ దిశ‌గా మాజీ ఎమ్మెల్యే  భూమా బ్రహ్మానందరెడ్డి కృషి చేస్తున్నారు.

శిల్పార‌వికి ఈ మునిసిపాలిటీని వైసీపీకి క‌ట్ట‌బెట్ట‌డం ఎంత ముఖ్య‌మో.. టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద రెడ్డికి కూడా అంతే ముఖ్యం.  గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు విముఖత చూపించారు.దీంతో పోరాడి సాధించుకున్న భూమా.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. దీంతో ఆయ‌న రాజ‌కీయం ముగిసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుని రాజ‌కీయంగా ఆయ‌న దూకుడుపెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇక‌, శిల్పా ర‌వి విష‌యానికి వ‌స్తే.. త‌న గెలుపు కేవ‌లం జ‌గ‌న్ హ‌వా వ‌ల్ల వ‌చ్చింద‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. త‌న స‌త్తా కూడా ఉంద‌ని.. కేవ‌లం జ‌గ‌న్ హ‌వాతోనే తాను గెల‌వ‌లేద‌ని త‌ర‌చుగా ఆయ‌న అంత‌ర్గ‌త స‌మావేశాల్లో చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు దానిని నిరూపించుకునే అవ‌కాశం వ‌చ్చింది. దీంతో ఆయ‌న కూడా త‌న‌దైన శైలిలో భార్య‌ను చైర్ పర్సన్ చేసుకునేందుకు త‌హ‌త‌హ లాడుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.