Begin typing your search above and press return to search.

కేబీఆర్ పార్కుకు ఫ్లై ఓవర్ల ఝలక్

By:  Tupaki Desk   |   3 Dec 2020 4:30 PM GMT
కేబీఆర్ పార్కుకు ఫ్లై ఓవర్ల ఝలక్
X
హైదరాబాద్ నగరంలో ప్రఖ్యాతిగాంచిన కేబీఆర్ పార్కుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. 390 ఎకరా విస్తీర్ణంలో నగరం నడిబొడ్డులో ఉన్న ఈ జాతీయ పార్కుకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి రోజు వందలాది మంది ఈ పార్కు వాక్ వేలో వాకింగ్, జాగింగ్ చేసేందుకు వస్తుంటారు. పచ్చటి మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు కూడా చాలామంది ఈ పార్కుకు వస్తుంటారు. ఈ కాంక్రీట్ జంగిల్ లో కేబీఆర్ పార్కు వంటివే జనాలకు ఊపిరి అని నగరవాసులు భావిస్తుంటారు. అయితే, త్వరలో ఈ పార్కు మీదుగా నిర్మించబోతోన్న ఫ్లై ఓవర్ల వల్ల వాక్ వే కుచించుకుపోయే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్ట్రేటెజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్డీపీ)కింద కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కేబీఆర్ జాతీయ పార్క్ అయినందువల్ల వాటి నిర్మాణం కోసం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతిని తెలంగాణ సర్కార్ కోరింది.

అయితే, ఫ్లై ఓవర్ల నిర్మాణం అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. అయితే, 2019లో చేపట్టాల్సిన ప్రజాభిప్రాయ సేకరణను తెలంగాణ సర్కార్ తాత్సారం చేసింది. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం జరపలేదు. అయితే, అనూహ్యంగా ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం టీ సర్కార్ పావులు కదుపుతోంది. ప్రస్తుతం 25-35 మీటర్ల వెడల్పున్న వాక్ వేను 3 మీటర్లకు పరిమితం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం 1394 చెట్లను కూడా కొట్టివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో, తెలంగాణ ప్రభుత్వంపై నగరవాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ వంటి హైదరాబాద్ మహానగరానికి సహజమైన ఆక్సిజన్ సిలిండర్ వంటి కేబీఆర్ పార్కును యథాతధ స్థితిలో ఉంచాలని ప్రభుత్వాన్ని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై కేసీఆర్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.