Begin typing your search above and press return to search.

గురువును ఓడించిన శిష్యుడ్ని తెగ పొగిడేస్తున్నారు

By:  Tupaki Desk   |   13 April 2021 5:30 AM GMT
గురువును ఓడించిన శిష్యుడ్ని తెగ పొగిడేస్తున్నారు
X
ఆట ఏదైనా సరే.. ప్రత్యర్థి గెలిస్తే.. ఓడిన జట్టు సంబరపడిపోతుందా? గెలిచిన జట్టు సంబరాలు.. తమవిగా ఫీల్ అవుతారా? గల్లీ ఆటలోనూ ఇలాంటి సీన్ కనిపించదు. కానీ.. అందుకు భిన్నమైన సీన్ ఐపీఎల్ లో సాక్ష్యాత్కరించింది. ఈ అరుదైన సన్నివేశానికి కారణం ఉత్తరాఖండ్ కు చెందిన 23 ఏళ్ల రిషబ్ పంత్ గా చెప్పాలి. తాజాగా అతగాడు నాయకత్వం వహించిన ఢిల్లీ జట్టులో చెన్నై జట్టు మీద ఘన విజయాన్నిసాధించింది. ఎవరూ ఊహించని రీతిలో ఓడిన చెన్నై ఆటగాళ్లు.. పంత్ ను సత్కరించటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అత్యంత అరుదగా చోటు చేసుకున్న ఈ ఉదంతానికి కారణం.. పంత్ వ్యవహారశైలేనని చెబుతారు.

తాజాగా మ్యాచ్ విన్నింగ్ షాట్ కొట్టిన పంత్.. విజయానందంతో ముందుకు నడుస్తుంటే.. అతడి వెనుక నడస్తున్న ప్రత్యర్థి చెన్నై జట్టు సభ్యులు అతనికి జేజేలు పలకటం విశేషం. ఎందుకలా? అంటే.. దానికోకారణం ఉందని చెబుతారు. గతంలో చెన్నై జట్టు గెలుపు సంబురాలు చేసుకున్న తరుణంలో.. ప్రత్యర్థి జట్టు సభ్యుడైనపంత్.. వారితో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. ‘ఇతరుల గెలుపును కూడా సెలబ్రేట్ చేసుకోగలిగితే.. మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు పంత్ కు చాలా త్వరగా వచ్చింది’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది పంత్ కు చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. గత ఏడాది ఆసీస్ పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులోకి చోటు దక్కించుకొని.. సిరీస్ మొత్తంలో అదరగొట్టేశాడు. టీమిండియా చారిత్ర విజయంలో కీలకభూమిక పోషించాడు. తాజాగా ఐపీఎల్ లో ఢిల్లీ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో గాయపడటంతో.. అతని స్థానంలో ఢిల్లీ కెప్టెన్సీ తీసుకోవటం.. తన గురువు అయిన ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌పై అద్భుత విజయాన్ని సాధించటం ఒక ఎత్తు అయితే.. అతగాడి విజయాన్ని ప్రత్యర్థి జట్టు సభ్యులు సైతం సంబరం చేసుకోవటం పంత్ సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పాలి.