Begin typing your search above and press return to search.

పెట్రోల్ ధ‌ర‌ల పాపం.. కేంద్ర‌, రాష్ట్రాల వాటా చూస్తే మైండ్ బ్లాకే!

By:  Tupaki Desk   |   12 July 2021 9:30 AM GMT
పెట్రోల్ ధ‌ర‌ల పాపం.. కేంద్ర‌, రాష్ట్రాల వాటా చూస్తే మైండ్ బ్లాకే!
X
నిన్న బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షుడు సోమూ వీర్రాజు మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నందుకు త‌మ పార్టీ చాలా బాధ‌ప‌డుతోంద‌ని అన్నారు. అంతేకాదు.. పెట్రో ధ‌ర‌లు కేంద్రానికి ఆదాయ వ‌న‌రు కాదు అని కూడా అన్నారు. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? చ‌మురు ధ‌ర‌లు పెరిగాయ‌ని బీజేపీనే బాధప‌డితే.. మ‌రి జనాన్ని బాధిస్తున్న‌ది ఎవ‌రు? అస‌లు ఈ ధ‌ర‌ల పాపం ఎవ‌రిది? రాష్ట్రాలదా? కేంద్రానిదా? అన్న‌ది చూద్దాం.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌మ‌స్య‌లో ఒక్క‌టి ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 70లలో ఉన్న ధ‌ర‌లు.. బీజేపీ స‌ర్కారు రాగానే వేగంగా పెర‌గ‌డం మొద‌లు పెట్టాయి. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యాన్ని కంపెనీల‌కే అప్ప‌గిస్తూ.. బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త‌ద్వారా.. త‌మ‌కు, పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు సంబంధం లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. కానీ.. అలా చేతులు దులుపుకుంటే స‌రిపోతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. మొత్తానికి పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు బీజేపీ స‌ర్కారు లైసెన్స్ ఇచ్చేయ‌డంతో.. ఆయిల్ కంపెనీలు ఇష్టారీతిన ధ‌ర‌లు పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్ప‌టికే లీట‌ర్ పెట్రోలు ధ‌ర‌ గ‌రిష్టంగా 114 రూపాయ‌ల‌ను తాకింది. ఇది రాజ‌స్థాన్ లో న‌మోదైంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం సెంచ‌రీ కొట్టేసింది. రెండు రూపాయ‌ల తేడాతో వంద పైన లీట‌రు పెట్రోల్ అమ్ముడ‌వుతోంది. జూన్ 11వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లీట‌రు పెట్రోలు ధ‌ర‌ 106.96 రూపాయ‌లుగా ఉంది. తెలంగాణ‌లో 104.93 రూపాయ‌లుగా ఉంది. దాదాపు దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. భారాన్ని ప్ర‌జ‌లు అనివార్యంగా మోయాల్సి వ‌స్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పెరిగేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అగ్రిసెస్‌ను విధించ‌డంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. చివరకు.. బీజేపీ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్యం సైతం దీన్ని త‌ప్పుబ‌ట్టారు.

శ్రీరామచంద్రుడు జన్మించిన భారత్‌లో పెట్రోల్ రేటు లీటర్ 93 రూపాయలు (బ‌డ్జెట్ స‌మ‌యంలో) పలుకుతోందని, అదే సీతమ్మ తల్లి జన్మించిన నేపాల్‌లో కేవలం 53 రూపాయలేనని సుబ్రహ్యణ్య స్వామి పేర్కొన్నారు. ఇక‌, రావణాసురుడు ఏలిన శ్రీలంకలో పెట్రోల్ 51 రూపాయలకే దొరుకుతోందని రాశారు. అంతేకాదు.. ఇక రామరాజ్యం ఎక్కడ ఉన్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. ఒక సొంత పార్టీ ఎంపీనే వాస్త‌వాల‌ను ఈ విధంగా వెల్ల‌డించినా.. మిగిలిన వారు మాత్రం అదేమీ కాదంటూ చెబుతుండ‌డం వారి రాజ‌కీయాన్ని తెలియజేస్తోంది.

నిజానికి.. ఒక్క రూపాయి డీజిల్, పెట్రోల్‌ ధ‌ర పెరిగిందంటే.. అది ఆయిల్ మీద మాత్ర‌మే పెరిగిన‌ట్టు కాదు. కూర‌గాయ‌లు, బియ్యం, పాలు, వంట నూనె ఇలా.. అన్ని నిత్యావ‌స‌ర స‌రుకుల మీద కూడా పుడుతుంది. వీటిని ర‌వాణా చేసేది వాహ‌నాల్లోనే కాబ‌ట్టి.. పెట్రో ధ‌ర‌లు పెరిగాయ‌ని వారు అనివార్యంగా రేట్లు పెంచేస్తారు. వారు పెంచారు కాబ‌ట్టి.. నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అమ్మేవారు సైతం పెంచేస్తారు. అంతిమంగా.. వాటిని కొనే జ‌నం జేబుల్లోంచే అంద‌రూ డ‌బ్బులు లాగేస్తారు.

దీనంత‌టికీ.. కేందం, రాష్ట్రాలు వేస్తున్న అద‌న‌పు ప‌న్నులే కార‌ణం అంటే న‌మ్ముతారా? ఈ ప‌న్నులు లేకుంటే.. ఇప్పుడు దేశంలో లీట‌రు పెట్రోలు కేవ‌లం 40 రూపాయ‌లకు దొరుకుతుంది. డీజిల్ 42 రూపాయ‌ల‌కు ల‌భిస్తుంది. మ‌రి, 100 రూపాయ‌లు ఎందుకు వ‌సూలు చేస్తున్నారు? అన్న‌ప్పుడు.. రాష్ట్రాలు, కేంద్ర ప్ర‌భుత్వం ప‌న్నులు వేసి, త‌మ ఖ‌జానా నింపుకుంటున్నాయి. జూన్ 11 నాటి ధ‌ర‌లు చూస్తే.. విదేశాల నుంచి వ‌చ్చిన‌ పెట్రోల్ మూల ధ‌ర కేవ‌లం 40.90 రూపాయ‌లు. డీజిల్ 42.80 రూపాయ‌లు. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం వేసే ప‌న్నులు చూస్తే గుండెలు అదిరిపోతాయి. లీట‌రు పెట్రోల్ పై ఏకంగా 32.90 రూపాయ‌లు, డీజిల్ 31.80 రూపాయ‌లు ప‌న్ను వేసి అన్యాయంగా లాగేస్తోంది. ఇటు రాష్ట్రాలు తామేమీ త‌క్కువ తిన‌లేదంటున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లీట‌ర్ పెట్రోలుపై 29.34, డీజిల్ పై 22.26 రూపాయ‌లు ప‌న్నువేసి వ‌సూలు చేస్తోంది. తెలంగాణ‌లో ఇంత‌క‌న్నా రెండు రూపాయ‌లు త‌క్కువ‌. పెట్రోల్ పై 27.31, డీజిల్ పై 20.82 రూపాయ‌లు ప‌న్నుగా వ‌సూలు చేస్తోంది.

ఇవ‌న్నీ క‌లుపుకొని ఏపీలో లీట‌రు పెట్రోలు ధ‌ర 106.96 రూపాయ‌లుగా ఉంది. డీజిల్ ధ‌ర 99.46 రూపాయ‌లుగా ఉంది. తెలంగాణ‌లో లీట‌రు పెట్రోలు రూ.104.93, డీజిల్ 98.02 రూపాయ‌లుగా ఉంది. అంటే.. మొత్తం పెట్రోలు ధ‌ర‌లో దాదాపు 60 శాతం డ‌బ్బులు ప‌న్నుల రూపంలోనే మింగేస్తున్నాయి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. ఇంత‌గా జ‌నం జేబులు గుల్ల చేస్తూ.. త‌మ‌కేమీ తెలియ‌దు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.