Begin typing your search above and press return to search.

ఆటగాళ్ల పై అనుకుంటే.. టీమిండియా సెలక్టర్ల పై వేటు పడింది..

By:  Tupaki Desk   |   19 Nov 2022 1:30 PM GMT
ఆటగాళ్ల పై అనుకుంటే.. టీమిండియా సెలక్టర్ల పై వేటు పడింది..
X
భారత క్రికెట్లో చడీచప్పుడు లేకుండా ఓ సంచలనం. ఎవరూ అనుకోని పరిణామం. అందరూ ఆటగాళ్ల గురించి ఆలోచిస్తుంటే.. అనూహ్యంగా సెలక్టర్లపై వేటుపడింది. అది కూడా ఇటీవలి టి20 ప్రపంచ కప్ పరాజయానికి సాకుగా చూపుతూ సెలక్టర్లందరినీ తొలగించేశారు. ఇది ఊహించని విషయం. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్ బోర్డులో పెరిగిన ప్రొఫెషనలిజానికి భిన్నంగా జరిగిన సెలక్టర్లపై వేటు అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలి కాలంలో ఇలా జరగలేదు..

2019 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్లో వెనుదిరిగింది. నాటి సెలక్షన్ కమిటీ చైర్మన్ తెలుగువాడైన ఎమ్మెస్కే ప్రసాద్. మరికొన్నాళ్లకు జరిగిన టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లోనూ టీమిండియాకు పరాజయం ఎదురైంది. అంతకుముందు 2015 వన్డే ప్రపంచ కప్ లోనూ టీమిండియా సెమీస్ లో ఓడింది. అంతెందుకు..? నిరుడు టి20 ప్రపంచ కప్ లీగ్ దశలోనే ఓటమిపాలైంది. కానీ, ఎన్నడూ సెలక్టర్లపై వేటు పడలేదు. ఒకటి, రెండు టోర్నీలు, సిరీస్ లు పరాజయంతో సెలక్టర్లను తప్పించే పద్ధతి క్రికెట్ బోర్డు మానేసింది. కానీ, ఇప్పుడు మాత్రం అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది.

ఇది ప్రక్షాళనకు సంకేతమా? టి20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంతో బీసీసీఐ చేపట్టిన సమూల మార్పులకు సెలక్టర్లపై వేటు సంకేతమా? అని అనిపిస్తోంది. ముందుగా జట్టును ఎంపిక చేసిన చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీని తప్పించడం అంటే..ఆటగాళ్లపైనా చర్యలు తప్పవని చాటుతోంది. ఇదే సెలక్షన్ కమిటీ నిరుడు ఎంపిక చేసిన జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌ కూడా చేరలేకపోయింది. కాగా, ప్రస్తుత సెలక్షన్ కమిటీలో చేతన్‌తో పాటు హరీదర్‌ సింగ్‌, సునీల్‌ జోషి, దేవాశిష్‌ మొహంతి ఉన్నారు.

కొత్త సెలక్టర్లకు ఉండాల్సిన అర్హతలివే.. సెలక్షన్‌ కమిటీని కొత్తగా ఏర్పాటు చేయనున్న బీసీసీఐ.. ఈ నెల 28 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువిచ్చింది. విశేషమేమంటే.. కొత్త సెలక్టర్ల విధులు, కర్తవ్యాలను తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. న్యాయంగా, పారదర్శక పద్ధతిలో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని, సీనియర్‌ పురుషుల టీమ్‌ రిజ్వర్‌ బెంచ్‌ను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలని, అందుకు ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొంది.

అవసరమైన సందర్భంలో జట్టు సమావేశాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లను గమనించేందుకు ప్రయాణాలు చేస్తూ ఉండాలని తెలిపింది. ఆటగాళ్ల, జట్టు ప్రదర్శనపై ప్రతి మూడు నెలలకోసారి నివేదికలు రూపొందించి బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు సమర్పించాలని వివరించింది. జట్టు ఎంపికపై, బీసీసీఐ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడాలని సూచించింది. ప్రతి ఫార్మాట్‌కు సరైన నాయకుడిని నియమించాలని తెలిపింది. బీసీసీఐ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నిర్దేశించింది.

అర్హతలు ఇవే.. సెలక్టర్ కాబోయేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు పూర్తి కావాలి. ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపు వారికే అవకాశం.మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు వీల్లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.