Begin typing your search above and press return to search.

ఇక బీజేపీలో తోకాడించడం కుదదరు..!

By:  Tupaki Desk   |   5 Aug 2021 5:53 AM GMT
ఇక బీజేపీలో తోకాడించడం కుదదరు..!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొన్ని రాష్ట్రాల్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సౌత్ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీ తన ప్రాతినిథ్యాన్ని కాపాడుకునేందుకు వ్యూహ, ప్రతీ వ్యూహాలను పన్నుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి మార్పు విషయంలో అధిష్టానం తనదైన శైలిలో ఆధిపత్యాన్నిచూపింది. అప్పటి వరకు సీఎంగా ఉన్న యడ్యూరప్పను మార్చడంతోపాటు కొత్త ముఖ్యమంత్రిని నియమించడం వరకు అధిష్టాన పెద్దలు ప్రణాళిక ప్రకారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త పాలకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి పోస్టును తీసేయడం కొత్త చర్చకు దారి తీసింది.

జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో అసమ్మతి లేదని చెప్పలేం. అయితే ఆ ఆసమ్మతిని బయటపడకుండా తొక్కిపెట్టడం ఆధిష్టానం రచించిన వ్యూహంలో భాగమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో 76 ఏళ్లు నిండిన వాళ్లు అధికారంలో ఉండే ఛాన్స్ లేదు. అయినా ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పకు రెండేళ్లు అవకాశం ఇచ్చారు. అయితే దానిని అధికార బలంతో పైకి పార్టీ ఆదేశాలు పాటిస్తున్నట్లు చేస్తూ.. లోలోపల మాత్రం తనకు నచ్చిందే చేస్తూ పార్టీ శ్రేణులు అసహించుకునేలా చేశారు. అయితే ఈ విషయాన్నొ తొందరగా గ్రహించిన అధిష్టానం యడ్యూరప్పకు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

వయసు దాటిపోయినా రెండేళ్లు అవకాశం ఇచ్చిన పార్టీ మరోసారి అవకాశం ఇస్తారని వేచి చూశారు. అయితే యడ్యూరప్ప ఆశలు ఆడియాశలే అయ్యాయి. ఇప్పటికే రెండేళ్లు అవకాశం ఇచ్చిన యడ్డీ దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరన్న అపవాదులు వచ్చాయి. సొంత పార్టీలోనే అసమ్మతి ఏర్పడి ఆధిష్టానానికి ఫిర్యాదు చేసేలా చేసుకున్నారు. కుల కుంపటిని తయారు చేసిన ఆయన కొన్ని వర్గాలకు మాత్రమే సపోర్టు చేస్తూ మిగతా వారిని పట్టించుకోలేనే ఆరోపణలున్నాయి.

పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం తెచ్చుకున్న కేంద్రం యడ్డీపై చర్యలు తీసుకోవాలని పూనుకుంది. దీంతో ఆయన పదవీ కాలం(అవకాశం ఇచ్చిన గడువు) పూర్తయ్యే వరకు వేచి చూసింది. అయితే ముందు తనకు నచ్చింది చేసిన యడ్డీ తన వెనుక అసమ్మతి తయారవుతుందున్న విషయం గ్రహించలేకపోయారు. అంతేకాకుండా తన కుమారుడి అక్రమాలను అడ్డుకోలేకపోయారు. దీంతో అధిష్టానం అగ్రహానికి యడ్డీ తన పదవి నుంచి తొలగిపోయినట్లు తెలుస్తోంది. పైకి వయసు మీరిన సందర్భంగా పదవి నుంచి తొలగిపోయినా అధికారంలో ఆయన పట్టు లేకుండా చేసింది అధిష్టానం.

ఇందులో భాగంగడా అధిష్టానానికి అనుకూలంగా ఉండే సీఎంను నియమించింది. మొదటి సారిగా ఒక్క ఉప ముఖ్యమంత్రి పోస్టు లేకుండా పాలకవర్గాన్ని నియమించింది. అసమ్మతి లేకుండా బుజ్జగించేవారికి ఇచ్చే పదవే ఉపముఖ్యమంత్రి పదవి. ఈసారి అ పోస్టునే లేకుండా చేయడంతో ఇక ఇప్పటి నుంచి ఎలాంటి బుజ్జగింపులు, అసమ్మతికి తావులేకుండా చూడాలని నిర్ణయించినట్లయింది. దీని ద్వారా కన్నడ బీజేపీకి అర్థమయిన విషయం ఏంటంటే పార్టీలో ఎలాంటి దూకుడుకు తావు లేదు. ప్రతి సందర్భాన్ని అధిష్టానం స్వయంగా పర్యవేక్షిస్తుంది.

మరోవైపు యడ్యూరప్ప కుమారుడికి మంత్రి పదవి అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయన పాచిక పారలేదు. కనీసం ఆయన అనుచరులకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన కేవలం పార్టీ నాయకుడిగా మాత్రమే ఉండాలన్నట్లు ప్రణాళిక వేసింది. మొత్తంగా యడ్యూరప్పను ఎవరూ పట్టించుకోనవసరం లేదన్నట్లు కేంద్రం ఎత్తులు వేసింది. యడ్యూరప్పే కాదు మున్ముందు పార్టీలో ఇలాంటి వారు తయారైతే ఇలాగే ఉంటుందని సంకేతాలు పంపడానికే అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందా..?లేదా..? అనేది వేచి చూడాలి.