Begin typing your search above and press return to search.

రూ.5 భోజనం కిడ్నాపర్ ను పట్టించింది

By:  Tupaki Desk   |   19 Oct 2019 7:54 AM GMT
రూ.5 భోజనం కిడ్నాపర్ ను పట్టించింది
X
జులాయిగా మారిన రాజు కన్న ఊరిని వదిలి పట్టణాల బాట పట్టాడు. మహబూబ్ నగర్ జిల్లా గుండ్యాల గ్రామానికి రాజు అనే యువకుడు దురలవాట్లకు, వ్యసనాలకు బానిసై బెంగళూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాల్లో కొద్దికాలం వంట చేశాడు. ఆ తర్వాత తిరుమలకు చేరి వంటపనిలో చేరాడు. అక్కడ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో స్థానికులు పోలీసులకు పట్టించారు. పోలీసులు రాజును బైండోవర్ కూడా చేశారు.

ఆ తర్వాత తన మకాంను రాజు గత జూలైలో స్వస్థలం గుండ్యాల గ్రామానికి మార్చాడు. అక్కడ నెలరోజులు ఉండి మళ్లీ సెప్టెంబర్ లోనే హైదరాబాద్ వచ్చాడు. కూలీ పనిచేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ లపై పడుకునేవాడు.

ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన దండు సురేష్ భార్య పిల్లలతో కలిసి తన సొంతూరు వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. గత రాత్రి రైల్వే స్టేషన్ లోనే పడుకున్నాడు. వీరిని గమనించిన రాజు తిరుమలలో బెగ్గింగ్ మాఫియాకు సురేష్ పిల్లలను అమ్మితే.. లేదా తనే వారితో భిక్షమెత్తిస్తే డబ్బులు వస్తాయని ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడువుగా గాఢనిద్రలోకి జారుకున్న సురేష్ వారి పిల్లలను గమనించాడు. సురేష్ కుమార్తె స్వర్ణలత(3)ను కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. చిన్నారిని భుజాలపై ఎత్తుకొని పారిపోయాడు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లిన సురేష్ స్థానిక బండిమేట్ వద్దకు రాగానే చిన్నారి లేచింది. తల్లిదండ్రులు లేకపోవడం.. రాజు ఎత్తుకోవడం చూసి గుక్కపెట్టి పెద్ద ఎత్తున ఏడ్వడం మొదలుపెట్టింది. స్థానికులు చూడడంతో రాజు చిన్నారి స్వర్ణలతను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు..

కొద్దిసేపటికి నిద్రలేచిన సురేష్ తన కూతురు కనిపించకుండా పోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే బండిమేట్ లో చిన్నారి పోలీసులకు దొరికింది. దీంతో తండ్రి సురేష్ కి చిన్నారిని పోలీసులు అప్పగించారు..

నిందితుడు రాజు కోసం వేట మొదలుపెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా అతడు రైల్వే స్టేషన్ లోనే ఉంటున్నాడని గుర్తించారు. అతడితో సాన్నిహితంగా ఉన్న కూలీలను వ్యక్తులను ఆరాతీసి ప్రతీరోజు మధ్యాహ్నం రూ.5 భోజనానికి రాజు సికింద్రాబాద్ స్టేషన్ లోని భోజనశాలకు వస్తుంటాడని గమనించారు. తెల్లవారి మధ్యాహ్నం కూడా రూ.5 భోజనం కోసం వచ్చిన రాజును పోలీసులు అక్కడే మాటువేసి పట్టుకొని విచారించారు. కిడ్నాప్ చేసింది తానేనని.. పిల్లలను బెగ్గింగ్ మాఫియాకు అమ్మేద్దామని అనుకున్నానని రాజు తెలిపాడు. ఇలా రూ.5 భోజనం రాజును పోలీసులకు పట్టించింది.