Begin typing your search above and press return to search.

ఆ ఎమర్జెన్సీ పై సుప్రీం లో వృద్ధురాలు పిటిషన్ ... రూ. 25 కోట్ల పరిహారం కావాలట !

By:  Tupaki Desk   |   4 Dec 2020 3:00 PM IST
ఆ ఎమర్జెన్సీ పై సుప్రీం లో వృద్ధురాలు పిటిషన్ ... రూ. 25 కోట్ల పరిహారం కావాలట !
X
భారతదేశ చరిత్రలో సుదీర్ఘ సమయం పాటు దాదాపుగా 21 నెలల సమయం పాటు దేశంలో ఎమర్జెన్సీ అమలు చేశారు. జూన్‌ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ అమలైంది. దేశ చరిత్రలో అత్యంత చీకటి రోజులుగా ఈ కాలాన్ని చెప్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెరిగిపోయిన ఆందోళనలు, అల్లర్లు అంతర్గత కల్లోల పరిస్థితుల దృష్ట్యా , ఆ సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇందిరా రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదంగా ఆనాటి ఎమర్జెన్సీ చరిత్రలో అలాగే నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ ని రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ 94 ఏళ్ల ఓ వితంతువు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అలాగే, ఎమర్జెన్సీని అమలుచేసిన అధికారుల నుంచి పరిహారంగా రూ.25 కోట్లు తనకి ఇప్పించాలని పిటిషన్‌ లో సుప్రీం ను కోరింది.

అప్పటి ఎమర్జెన్సీ కారణంగా ఆమె,ఆమె కుటుంబం అనుభవించిన వేదనకు న్యాయం జరగాలని న్యాయవాదులు డా.నీలా గోఖలే,డా.అనన్య ఘోష్ ఈ పిటిషన్‌ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. డిసెంబర్ 7న ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ ఎస్‌ కే కౌల్ నేత్రుత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ ను విచారించనుంది. ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను పిటిషన్‌ లో గుర్తుచేసిన ఆమె, ఆనాటి అధికారులు గృహాలను,వ్యాపారులను దోచుకున్నారని ఆరోపించారు.

ఆ నిర్బంధ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తాము దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందని తెలిపింది. నా భర్త వ్యాపారం మూతపడింది... స్థిరాస్తులతో సహా అన్ని ఆస్తులు,విలువైన వస్తువులన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా నా భర్త మరణించారు. అప్పటినుంచి ఎమర్జెన్సీ కాలంలో నా భర్తపై మోపిన అభియోగాలను ఒంటిచేత్తో ఎదుర్కొంటున్నాను అని పిటిషన్‌ లో పేర్కొన్నారు.

2014లో ఢిల్లీ హైకోర్టు.. మరణించిన తన భర్తపై మోపిన అభియోగాలను ఎట్టకేలకు కొట్టిపారేసిందని చెప్పారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో అధికారులు జప్తు చేసిన కోట్ల రూపాయల తన భర్త ఆస్తులను ఇంకా తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు.ఎమర్జెన్సీ సమయంలో అధికారులు చట్ట విరుద్దంగా,అక్రమంగా విలువైన చరాస్తులను,విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు.