Begin typing your search above and press return to search.

ఈ మాస్కును వాడేసిన తర్వాత పాతేస్తే.. మొక్కలు వస్తాయి

By:  Tupaki Desk   |   19 April 2021 4:30 PM GMT
ఈ మాస్కును వాడేసిన తర్వాత పాతేస్తే.. మొక్కలు వస్తాయి
X
ఏడాది క్రితం మాస్కు అంటే పెద్దగా తెలీనోళ్లు చాలామందే ఉన్నారు. అందులోకి సర్జికల్ మాస్కులు.. ఎన్ 95.. ఇలా రకరకాల పేర్లతో వచ్చిన మాస్కుల గురించి అవగాహన బొత్తిగా ఉండేది కాదు. ఆ మాటకు వస్తే.. మాస్కుల్ని ఎలా వినియోగించాలి? ఎన్నిరోజులు వాడాలన్న విషయం తెలీని పరిస్థితి. కరోనా పుణ్యమా అని.. మాస్కుల్ని ఎలా వాడాలి? ఎంతలా వాడాలి? ఏయే విధానాలతో వాటిని తయారు చేయాలో బాగానే అర్థమైన పరిస్థితి.

కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. సెకండ్ వేవ్ తో మరోసారి భారీగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మాస్కుల వినియోగం భారీగా పెరిగింది. దీంతో.. మాస్కుల చెత్త కొత్త సమస్యగా మారింది. ఈ మధ్యనే మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపారి కక్కుర్తితో.. వాడి పారేసిన మాస్కులతో పరుపులు తయారు చేసే వైనం బయటకొచ్చి షాక్ తిన్న పరిస్థితి. అలాంటి కక్కుర్తి పనులెన్నో తెర మీదకు వస్తున్నాయి. మరికొందరు.. నాణ్యత లేని మాస్కుల్ని మార్కెట్లోకి తెస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రపంచ వ్యాప్తంగా భారీగా వినియోగిస్తున్న మాస్కుల కారణంగా.. వాటి చెత్త అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో.. వాటిని ప్రాసెస్ చేయటం ఇప్పుడో సమస్యగా మారింది. మాస్కు వ్యర్థాల్ని తగ్గించటం ఇప్పుడో సమస్యగా మారిన వేళ.. ఒక సంస్థ వినూత్నమైన ఆలోచనతో తెర మీదకు వచ్చింది. విన్నంతనే వావ్ అనిపించేలా ఉన్న ఈ ఐడియా ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది.

ఇంతకూ ఆ ఐడియా ఏమంటే.. మాస్కును దళసరి పేపర్.. లేదంటే వస్త్రం మధ్యలో టమాటా.. తులసి.. దోసకాయ.. క్యాప్సికం లాంటి కూరగాయల విత్తనాల్ని పెట్టి తయారు చేశారు. ఈ మాస్కుల్ని వాడి పారేసిన తర్వాత.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. దీంతో.. ఈ మాస్కులు పర్యావరణహితంగా ఉండనున్నాయి. కాకుంటే.. వీటిని ఒక్కసారి మాత్రమే వాడాల్సి ఉంటుంది. పదే పదే వినియోగించే వీల్లేదు. ఉతుక్కొని వాడే అవకాశం అస్సలు ఉండదు.

మంగళూరుకు చెందిన పేపర్ సీడ్ అనే సంస్థ ఈ వినూత్నమైన మాస్కుల్ని తయారు చేసింది. ప్రయోగాత్మకంగా 400 మాస్కుల్ని రూపొందించారు. తమ ప్రయోగం సక్సెస్ అయితే.. రానున్న రోజుల్లో మరిన్ని మాస్కుల్ని తయారు చేస్తామని చెబుతున్నారు. తమ మాస్కుల గురించి వివరాలు తెలిసిన వారు.. పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారని.. ఇప్పటికే చెన్నైతో పాటు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల నుంచి ఆర్డర్లు వచ్చినట్లుగా పేపర్ సీడ్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో వీరు.. పర్యావరణ రాఖీలు.. కీచైన్లు..కొబ్బరి మట్టలతో కప్పులు.. లాంటివెన్నో పర్యావరణ హితమైన సామాన్లను తయారు చేసిన చరిత్ర ఉంది. రానున్న రోజుల్లో ఈ పేపర్ మాస్కులు ట్రెండ్ గా మారతాయాని చెప్పక తప్పదు.