Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ అని నమ్మితే.. కొడుకుపై దారుణం..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 7:47 AM GMT
ఫ్రెండ్ అని నమ్మితే.. కొడుకుపై దారుణం..!
X
ఈ కలియుగంలో బంధాలు.. అనుబంధాలకు ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. ఆడపిల్లలపై నిత్యం ఏదో ఒకచోట దారుణమైన సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీంతో ఆడ పిల్లలను బయటికి పంపించాలంటే తల్లిదండ్రలు భయపడాల్సి వస్తోంది. అయితే ఆడపిల్లలపై అమానవీయమైన సంఘటనలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం బంధువులో.. స్నేహితులో ఉండటం మరింత కలవరానికి గురిచేస్తోంది.

ఆడపిల్లల పరిస్థితి సమాజంలో ఇలా ఉంటే మగవారి కూడా రక్షణ లేకుండా పోతుంది. సర్ ప్రైజ్ పేరిట ఒక అమ్మాయి యువకుడి గొంతుకోసిన సంఘటన కొన్ని నెలల క్రితం విశాఖలో సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటనల్లో సమాజం ఆడవాళ్లకు ఇచ్చిన ప్రాధాన్యత మగవారికి ఇవ్వకపోవడంతో చాలా విషయాలు బయటికి రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక లైంగిక దాడులు కేవలం ఆడవాళ్లపై జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ ఇటీవలీ కాలంలో మగవాళ్ళు సైతం ఇందులో బాధితులుగా మారుతున్నారు. అలాగే తరుచూ బాలికలపై దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఏడాది వయసున్న బాలుడిపై ఓ వ్యక్తి అసహజమైన సెక్స్ చేయడమే కాకుండా బండరాయితో మోది చంపడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని యశవంతపురం సమీపంలోని మురికివాడలో ఒక యువకుడు తన ఏడాది వయసున్న కుమారుడితో నివసిస్తున్నాడు. 2015 సెప్టెంబర్ 12న ఆ యువకుడు తన కొడుకుతో కలిసి సినిమా థియేటర్ వెళ్లాడు. ఆ సమయంలో తన బంధువు నుంచి అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో అక్కడే ఉన్నటువంటి తన స్నేహితుడికి కుమారుడిని అప్పగించాడు.

రెండు గంటల్లో తిరిగి వచ్చి బాబు తీసుకెళ్తానని ఆ స్నేహితుడికి చెప్పాడు. అయితే అతడు తిరిగి వచ్చేలోగా దారుణం జరిగిపోయింది. స్నేహితుడని నమ్మి బాలుడిని అప్పగిస్తే ఆ వ్యక్తి ఒక నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అసహజమైన సెక్స్ కు పాల్పడ్డాడు. ఈ సమయంలో బాలుడు కేకలు వేయడం భయపడిన అతడు పెద్ద సిమెంట్ బండరాయిని చిన్నారి తలపై మోది హతమార్చాడు.

అనంతరం బాలుడి శవంపై చిత్తుకాగితాలు వేసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ యువకుడి స్నేహితుడి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బెంగళూరు మొదటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులో విచారణ జరుగగా తాజాగా నేరం రుజువైంది.

దీంతో కోర్టు ఆ యువకుడి స్నేహితుడికి ఫోక్సో చట్టం కింద ఉరిశిక్షతో పాటు రూ. 50వేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎట్టకేలకు కామంధుడికి ఉరిశిక్ష పడటంతో తనకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.