Begin typing your search above and press return to search.

ఆ ఎంపీకి షాకిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ!

By:  Tupaki Desk   |   16 Nov 2022 11:30 AM GMT
ఆ ఎంపీకి షాకిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ!
X
కేరళ రాజధాని తిరునంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు ఆ పార్టీ షాకిచ్చింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేయనున్న స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా నుంచి శశిథరూర్‌ను తప్పించింది.

వాస్తవానికి శశిథరూర్‌ను గుజరాత్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ప్రచారానికి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ప్రచారానికి వెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి తమ పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను సమర్పించింది. ఇందులో శశిథరూర్‌ పేరు లేకపోవడం గమనార్హం.

దీంతో లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతో ప్రచారం నుంచి శశిథరూర్‌ తప్పుకున్నట్టు సమాచారం. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో పలు రాష్ట్రాల నాయకులకు స్థానం కల్పించి శశిథరూర్‌కు చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవికి మల్లిఖార్జున ఖర్గేతోపాటు శశిథరూర్‌ సైతం పోటీపడ్డారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికే తాను పోటీ చేస్తున్నానని అప్పట్లో శశిథరూర్‌ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే గెలుపొందగా శశిథరూర్‌ ఓటమిపాలయ్యారు.

తనపై పోటీకి దిగిన శశిథరూర్‌పై మల్లిఖార్జున ఖర్గే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాను సోనియా గాంధీ అనుమతితోనే జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేశానని శశిథరూర్‌ ప్రకటించారు. తమకు నచ్చిన వ్యక్తిని కాంగ్రెస్‌ డెలిగేట్లు ఎంచుకుంటారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో ఏకవ్యక్తిత్వానికి స్థానం లేదన్నారు.

అంతేకాకుండా శశిథరూర్‌ గతంలో పార్టీలో సంస్కరణలు కోరుతూ కాంగ్రెస్‌లో ఒక వర్గం నేతలు ఏర్పాటు చేసిన జీ–23 నేతల్లో ఒక సభ్యుడిగానూ ఉన్నారు.

కాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్, దిగ్విజయ్‌ సింగ్, కమల్‌నాథ్, సచిన్‌ పైలట్, కన్హయ్య కుమార్, అశోక్‌ చవాన్, తదితర హేమాహేమీలు ఉన్నారు.

కాగా గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు డిసెంబర్‌ 8న వెలువడతాయి. అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం దక్కించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.