Begin typing your search above and press return to search.

ప్రజా మద్దతుతో సర్పంచ్ ‌గా గెలిస్తే.. కులం కింద కూర్చోబెట్టింది

By:  Tupaki Desk   |   11 Oct 2020 1:30 AM GMT
ప్రజా మద్దతుతో సర్పంచ్ ‌గా గెలిస్తే.. కులం కింద కూర్చోబెట్టింది
X
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. కులాల అంతరాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. టెక్నాలజీ అరచేతిలోకి అంది వచ్చినా.. కొన్ని గ్రామాలను కులాల జాఢ్యం వెంటాడుతోంది. ఏనాడో కులాల అంతరాలు సమసిపోయాయని చెప్పే వితండవాదులు ఒక్కసారి తమిళనాడు లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే ప్రస్తుత పరిస్థితి ఏమిటో అర్థమౌతుంది. ఆమె ను నామినేటెడ్ పోస్టుతో అధికారం చేజిక్కించుకోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్ గా గెలిచింది. ప్రజల మద్దతుతో మెజార్టీ విజయం సాధించింద. అయితే గ్రామ పెద్దలు ఆమెని కులం పేరు చెప్పి ఓడించారు. వాళ్లందరూ పైన కూర్చుండి.. సర్పంచును మాత్రం కింద కూర్చోబెట్టారు.

వివరాలు.. కడలూరు జిల్లాలోని తెర్‌కుత్తిట్టై గ్రామానికి చెందిన రాజేశ్వరి గత జనవరిలో పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలిచారు. ఆమె దళిత వర్గానికి చెందిన మహిళ. గ్రామంలో 500 కుటుంబాలు ఉండగా.. 100 కుటుంబాలు షెడ్యూల్డ్‌ కులానికి చెందినవి. మిగతా మొత్తం వన్నియార్‌ కులానికి చెందినవి. ఈ నేపథ్యంలో పంచాయతీ సమావేశాల్లో మిగతా సభ్యులంతా, కుర్చీలపై ఆసీనులైతే.. రాజేశ్వరిని మాత్రం కిందనే కూర్చొమనేవారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ వివక్షపూరిత చర్యకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారు.

ఈ విషయం గురించి రాజేశ్వరి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా కులాన్ని కారణంగా చూపి ఉపాధ్యక్షుడు నన్ను ఈ విధంగా కింద కూర్చోబెట్టారు. అంతేకాదు జెండా ఎగురవేసేందుకు కూడా నన్ను అనుమతించడు. వాళ్ల నాన్నతోనే ఆ కార్యక్రమం పూర్తి చేయిస్తాడు. నేను ఈ పదవికి ఎంపికైన నాటి నుంచి ఏడాది కాలంగా అగ్ర వర్ణ పెద్దలు చెప్పినట్లుగానే వింటున్నాను. అయినా వాళ్లు నన్ను అవమానిస్తూనే ఉన్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.