Begin typing your search above and press return to search.

బీహార్ ఎన్నికలు: మోడీ ఫొటోలు వాడొద్దు.. బీజేపీ హెచ్చరిక

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:58 PM GMT
బీహార్ ఎన్నికలు: మోడీ ఫొటోలు వాడొద్దు.. బీజేపీ హెచ్చరిక
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నుంచి ఇటీవలే లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వైదొలిగిన సంగతి తెలిసిందే.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటన చేయడం బీజేపీ-జేడీయూ కూటమికి షాకిచ్చింది.

ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి తాము ఎన్నికలకు వెళ్లమని ఎల్జేపీ తేల్చిచెప్పింది. బీజేపీతో భాగస్వామిగా ఉంటాం కానీ.. బీహార్ లో నితీష్ తో కలవమంటూ చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ప్రధాని మోడీ నాయకత్వానికి మాత్రం మద్దతునిస్తామని ప్రకటించారు. నితీష్ ను ఓడించడమే లక్ష్యంగా జేడీయూపై అభ్యర్థులను నిలబెడతామంటూ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ తేల్చిచెప్పారు.

కాగా బీహార్ లో మాత్రం ఇప్పటికే సీఎం నితీష్ సారథ్యంలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నారు. అయితే ఇందులో ఇన్నాళ్లు ఉన్న ఎల్జీపీ మాత్రం బయటకు వచ్చింది. ఎల్జీపీ సొంతంగా బీహార్ లో పోటీచేస్తుందని.. అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీహార్ లో అక్టోబర్ 28 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

ఎన్డీఏ నుంచి వైదొలిగిన ఎల్జేపీకి తాజాగా బీజేపీ షాక్ ఇచ్చింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఫొటోలను ఎల్జేపీ వాడరాదని బీజేపీ నాయకత్వం హెచ్చరించింది. మోడీ పేరు ను కూడా ఎల్జేపీ వాడకుండా చూడాలని ఎన్నికల కమిషన్ ను కోరుతామని బీజేపీ నేతలు చెప్పారు. దీంతో ఒంటరిగా పోటీపడుతున్న ఎల్జేపీకి ఈ పరిణామం మింగుడుపడడం లేదు.