Begin typing your search above and press return to search.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత రామ్‌నాథ్ కోవింద్ కు ల‌భించే ప్ర‌యోజ‌నాలివేనా?

By:  Tupaki Desk   |   20 July 2022 1:30 AM GMT
ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత రామ్‌నాథ్ కోవింద్ కు ల‌భించే ప్ర‌యోజ‌నాలివేనా?
X
భార‌త ప్ర‌స్తుత‌ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 25న ముగియనుంది. ఈ నేప‌థ్యంలో జూలై 18న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము సులువుగా గెలిచే అవ‌కాశాలున్నాయి.

ఈ క్ర‌మంలో జూలై 24న ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వ‌ర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు.

వాస్త‌వానికి ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ ను ఖాళీ చేయాల్సి ఉన్నా రెండ్రోజుల ముందే రామ్‌నాథ్ కోవింద్ తన ఇంటి సామానును ఢిల్లీలోని 12 జన్‌పథ్ బంగ్లాకు తరలించాలని నిర్ణయించారు. ఇదే బంగ్లాలో రెండు దశాబ్దాలకు పైగా దివంగ‌త కేంద్ర మంత్రి, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ అధినేత‌ రామ్ విలాస్ పాశ్వాన్ ఉన్నారు. ఆయన మర‌ణించిన‌ప్ప‌టి నుంచి ఈ బంగ్లా ఖాళీగా ఉంది.

ఈ నేప‌థ్యంలో రామ్‌నాథ్ కోవింద్ ఈ ఇంటిలోకి వ‌స్తుండ‌టంతో ఆయ‌న‌ కుమార్తె స్వాతి కోవింద్ బంగ్లాలో తమకు అనుకూలంగా కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఈ బంగ్లా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి పక్కనే ఉంటుంది.

కాగా ప‌ద‌వీ విర‌మ‌ణ‌ తర్వాత రామ్‌నాథ్ కోవింద్‌కు నెలకు రూ.1.50 ల‌క్ష‌లు పెన్షన్ ఇస్తారు. సిబ్బంది కోసం నెలకు రూ.60 వేలు అదనంగా ఇస్తారు. బంగ్లాకు అద్దె కూడా ఉండదు. కరెంట్, మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్, ఇంటర్‌నెట్, నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండ‌దు. కారుతోపాటు డ్రైవర్‌ను కూడా ఇస్తారు. అన్ని వసతులున్న వాహనం కూడా అందుబాటులో ఉంచుతారు.

ఇక ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు పూర్తిగా ఉచితం. రాష్ట్రపతితో పాటు మరొకరికి విమాన, రైలు ప్రయాణాలు ఉచితం. ఐదుగురు సిబ్బందిని కేటాయిస్తారు. ఇద్దరు సెక్రటరీలు అందుబాటులో ఉంటారు. ఢిల్లీ పోలీసులతో ర‌క్ష‌ణ క‌ల్పిస్తారు.