Begin typing your search above and press return to search.

కృష్ణా జలాల లొల్లిపై తెలంగాణ తీరును తప్పు పడుతూ ఏపీ వాదన ఇదేనట

By:  Tupaki Desk   |   13 July 2021 4:08 AM GMT
కృష్ణా జలాల లొల్లిపై తెలంగాణ తీరును తప్పు పడుతూ ఏపీ వాదన ఇదేనట
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల జగడం అంతకంతకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు పోటాపోటీగా కేంద్రానికి ఫోన్లు చేయటం.. తమ వాదనను వినిపిస్తుండటం.. ఎదుటి రాష్ట్రం ఎన్ని తప్పులు చేస్తుందో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తమను తాము సమర్థించుకోవటం.. ఎదుటివారిని తప్పు పడుతున్న తీరు ఇప్పుడు వాతావరణాన్ని వేడెక్కించేలా చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ తీరును తప్పు పడుతూ ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగ్గట్లు తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ చేశారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి రిజర్వాయర్లలోని నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తోడేయటం.. విద్యుదుత్పత్తిని చేస్తూ దిగువనకు విలువైన జలాల్ని సముద్రంలోకి కలిసే పరిస్థితులపైనా ఏపీ సర్కారు తీవ్రంగా అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న రిట్ పిటిషన్ లోని అంశాలు ఏమేం ఉండాలన్న దానిపై ఇరిగేషన్ అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించనున్నారు. అందులో ముఖ్యమైనది నదీ జలాల వివాదాల నేపథ్యంలో వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదులపై ఉండే రిజర్వాయర్లు.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ.. భద్రతలను ఆయా నదీ యాజమాన్య బోర్డులకే అప్పగించాలి. భద్రత కోసం కేంద్ర బలగాల పహారా ఏర్పాటు చేయాలని స్పష్టం చేస్తుంది. నదీ జలాల్లో నీటి వాటాలపై వివిధ ట్రిబ్యునళ్లు.. కోర్టులు తమ తీర్పులతో ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో.. వాటిని కచ్ఛితంగా అమలు చేయాలని కోరనున్నాయి.

నిర్దేశించిన వాటా కంటే అధికంగా నీటిని వినియోగిస్తే.. అది అక్రమమని తేల్చటం.. ఒప్పందాలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులు కట్టటం.. లేదంటే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించటం లాంటివి కూడా అక్రమ చర్యలుగా గుర్తించటంతో పాటు.. అలాంటి వివాదాలకు శాశ్వత పరిష్కారం అవసరమన్న విషయాన్ని కోర్టుకు తెలపనున్నారు. నదీ జలాల వివాదాల్ని ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపర్చిన నేపథ్యంలో కేంద్రమే వాటిని పరిష్కరించాలని కోరనున్నారు. అంతేకాదు.. అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉండే రిజర్వాయర్లు.. వాటికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలన్ని కూడా బోర్డు పరిధిలోనే ఉండాలని ఏపీ కోరనున్నట్లు చెబుతున్నారు.

కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు.. సాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలని కోరనున్నారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్ లో ప్రస్తావించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నది దిగువన ఉన్న రాష్ట్రానికి తాగునీరు.. సాగునీరు అవసరాల నిమిత్తం పై ప్రాంతంలో ఉన్న రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేయాలి. అంతే తప్పించి.. దిగువ రాష్ట్రాలతో సంబంధం లేకుండా పై ప్రాంతంలో సాగునీరు.. తాగునీరు అవసరాలు లేకున్నా.. కేవలం విద్యుదుత్పత్తి కోసం నీళ్లను విడుదల చేయటాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు.

జలాల వినియోగానికి సంబంధించి ఇచ్చిన అవార్డుల్ని పట్టించుకోకుండా ఒప్పందాల్ని తీవ్రంగా ఉల్లంఘిస్తూ అనూహ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలాంటి చట్టాలు తమకు వర్తించవని అనుకుంటున్న వేళలో సుప్రీంకోర్టును ఆశ్రయించటం తప్పించి వేరే గత్యంతరం లేదన్న విషయాన్ని ఏపీ సర్కార్ స్పష్టం చేస్తోంది. పూర్తి సామర్థ్యం మేరకు జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే సస్పెండ్ చేయాలని.. కృష్ణా బోర్డ విధివిధానాల్ని ఖరారు చేయాలని సుప్రీంను తాజా రిట్ పిటిషన్ ద్వారా కోరనున్నారు. మరి.. ఏపీ సర్కారు ప్రయత్నాలకు సుప్రీం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.