Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ ఉప ఎన్నిక 7 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నట్లే

By:  Tupaki Desk   |   7 Dec 2020 6:00 AM IST
ఏపీలో ఆ ఉప ఎన్నిక 7 అసెంబ్లీ స్థానాలకు  జరుగుతున్నట్లే
X
అధికారపక్షానికి చెందిన తిరుపతి ఎంపీ మరణంతో ఇప్పుడా స్థానం ఖాళీ అయ్యింది నిబంధనల ప్రకారం సదరు ఎంపీ మరణించిన నాటి నుంచి ఆర్నెల్ల లోపు ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో.. తిరుపతి ఉప ఎన్నిక వేడి రాజకీయ వర్గాల్లో మొదలైంది. అధికార.. విపక్షాల మధ్యనున్న బలాబలాలు ఈ ఉప ఎన్నిక స్పష్టం చేయనుంది. అధికారపార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలకు.. జగన్ పాలనకు గీటురాయిగా ఈ ఉప ఎన్నిక ఫలితాల్ని అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఫలితం.. దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోని ప్రజల అభిప్రాయాన్ని తెలియజేస్తాయని భావిస్తున్నారు.

సార్వత్రి క ఎన్నికల సమయంలో తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలిపొందారు. అంతేకాదు.. ఆ ఎన్నికల్లో చక్కటి అధిక్యత కూడా లభించింది. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో జగన్ పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించారు. టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని ఓడించారు. ఈ ఎన్నికలో 14 వేల మంది మెజర్టీ లభించింది. అదే విధంగా గూడురు.. సూళ్లూరుపేట.. వెంకటగిరి.. తిరుపతి.. శ్రీకాళహస్తి.. సత్యవేడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆ ఎన్నికల్లో సత్తా చాటటమేకాదు.. భారీ అధిక్యతను ప్రదర్శించారు.

త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నిక కారణంగా.. మొత్తం ఎన్నిక ఫలితంతో పాటు.. ఎంపీ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోకవర్గాల వారీగా పార్టీ బలం ఎలా ఉందన్న విషయాన్ని విశ్లేషించుకునే వీలు కలగటం ఖాయం. రాజకీయ దిద్దుబాట్లకు తిరుపతి ఉప ఎన్నిక ఒక పాఠంగా మారే వీలుంది. మరి.. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎవరికి ఎలాంటి అనుభవాన్ని మిగిలిస్తుందో చూడాలి.