Begin typing your search above and press return to search.

కరోనా భయంతో కర్నూల్లో టెన్షన్!

By:  Tupaki Desk   |   16 March 2020 5:06 AM GMT
కరోనా భయంతో కర్నూల్లో టెన్షన్!
X
కరోనా భయంతో కర్నూలు జిల్లా గజగజ వణికి పోతోంది. అక్కడ అధికారికం గా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా విపరీతంగా టెన్షన్‌ పడడానికి కారణం ఓ వ్యక్తి. వైరస్ లక్షణాలున్నాయని అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఆస్పత్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కబురు హాస్పిటల్‌ కాంపౌండ్‌ వాల్‌ దాటేసింది. వైరస్‌ కంటే స్పీడుగా జనాల్లోకి వెళ్లింది. దీంతో, ఆ అపరిచితుడు ఎవరు? ఎక్కడికెళ్లాడు? అసలు కర్నూల్లోనే ఉన్నాడా? జిల్లాలోని వేరే ప్రాంతాలకు వెళ్లాడా? జిల్లానే దాటేశాడా?.. బయటికెళ్తే తమ పరిస్థితేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కర్నూలు ప్రజల మైండ్‌ను గ్రైండ్‌ చేస్తున్నాయి.

సౌదీ అరేబియా నుంచి వచ్చిన వ్యక్తి.. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కర్నూలు హాస్పిటల్‌లో చేరాడు. గుట్టుగా ఉంచాల్సిన ఈ విషయం హాస్పిటల్‌ స్టాఫ్‌ నోట్లో దాగలేదు. మిగిలిన రోగులకూ పాకింది. దీంతో, వైద్యాన్ని సగంలోనే వదిలేసి, హాస్పిటల్‌ నుంచి సగం మంది వెళ్లిపోయారు. ఒక రోగాన్ని వదిలించుకోవడానికి వచ్చి మరో రోగాన్ని తగిలించుకోవడమెందకంటూ జారుకున్నారు. ఇక, కరోనా లక్షణాలున్నాయని అనుమానిస్తున్న వ్యక్తి కూడా హఠాత్తుగా ఆస్పత్రి నుంచి మాయమయ్యాడు.

ఇక చూడాలి హాస్పిటల్‌ స్టాఫ్‌ హైరానా. అతని కోసం ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. ఎక్కడికెళ్లాడో తెలుసుకోలేక పోయారు. దీంతో ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి తలవాచేలా తిట్లు తిన్నారు. హైయ్యర్‌ అఫీషియల్స్‌ సూచనతో పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు హాస్పిటల్‌ బయట, వీధుల్లో, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ దగ్గరున్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అతను సిటీలోనే ఉన్నాడా, సరిహద్దులు దాటాడా, సిటీలోనే ఉంటే ఎటు వెళ్లాడు అని ఆరా తీస్తున్నారు. అసలే కరోనా భయంతో జనం గుండెలు గుప్పెట్లో పెట్టుకుంటే, పులి మీద పుట్రలా ఇప్పుడీ కొత్త తలనొప్పి పుట్టుకొచ్చింది.