Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం

By:  Tupaki Desk   |   2 Dec 2019 9:28 AM GMT
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం
X
అమెరికాలో దారుణం జరిగింది. ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతిచెందారు. వీరిద్దరూ ఒకే యూనివర్సిటీ విద్యార్థులుగా గుర్తించారు. టెనస్సీ స్టేట్ యూనివర్సిటీలో వీరు చదువుతున్నారు. తెలుగు విద్యార్థి మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది.

టెనస్సీ స్టేట్ యూనివర్సిటీలో విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టి (26) ఫుడ్ సైన్సెస్ లో పీహెచ్ డీ చేస్తున్నాడు. అక్కడే ఎంఎస్ చేస్తున్న తన స్నేహితుడు జూడీ స్టాన్లీ పినీరియో (23)తో కలిసి గురువారం రాత్రి వైభవ్ ఒక పార్టీకి వెళ్లాడు.

పార్టీ నుంచి తిరిగి వస్తుండగా వీరిద్దరు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో వైభవ్, స్టాన్లీ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ వాహనం అక్కడే వదిలి పారిపోయాడు.

ఇక ఒకే యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతికి యూనివర్సిటీ సంతాపం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది. అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం వైభవ్ మృతదేహాలను ఇండియాకు పంపించడానికి సహాయం చేస్తోంది.