Begin typing your search above and press return to search.

అమెరికాలో భయాందోళనలో తెలుగు ప్రజలు

By:  Tupaki Desk   |   25 March 2020 7:31 AM GMT
అమెరికాలో భయాందోళనలో తెలుగు ప్రజలు
X
కరోనా మహమ్మారి అమెరికాలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో అక్కడ ఉన్న తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ముఖ్యంగా న్యూజెర్సీ, దాని పక్కన ఉన్న న్యూయార్క్‌ లో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. తెలుగు వారు అత్యధికంగా ఉండే న్యూజెర్సీ - న్యూయార్క్ - క్యాలిఫోర్నియా ప్రాంతాల్లో కరోనా ప్రబలుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. న్యూజెర్సీ - కాలిఫోర్నియా - న్యూయార్క్‌ లో ఉన్న భారతీయుల్లో అత్యధికంగా తెలుగు వారే ఉన్నారు. దీంతో తీవ్ర భయాందోళనలో అక్కడి తెలుగు ప్రజలు ఉన్నారు.

భారీగా కరోనా కేసులు..

మంగళవారం సాయంత్రానికి న్యూయార్క్‌ లో 29,875 కేసులు నమోదు కాగా 157 మృతిచెందారు. న్యూజెర్సీలో 2,844 మంది కేసులు నమోదవగా 27 మంది మరణించారు. ఈ విధంగా కరోనా విజృంభిస్తుండడంతో తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రజలెవరూ గడప దాటి బయటకు రావడం లేదు. కోవిడ్‌ కేసులతో సతమతమవుతుండడంతో ప్రజలు అడుగు బయట పెట్టడం లేదు. పూర్తిగా షట్‌ డౌన్‌ ప్రకటించడంతో ఇంటికే పరిమితమయ్యారు. అక్కడ ఉండలేకపోతున్నారు. భారత్‌ కు వద్దామంటే అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధించారు. దీంతో తెలుగు ప్రజలు ఎటు పాలుపోని పరిస్థితిలో ఉన్నారు.