Begin typing your search above and press return to search.

నెల రోజుల్లో పెళ్లి ..ఇంతలోనే ఎన్‌కౌంటర్‌ లో తెలుగు జవాన్ వీర మరణం !

By:  Tupaki Desk   |   9 July 2021 11:30 AM GMT
నెల రోజుల్లో పెళ్లి ..ఇంతలోనే  ఎన్‌కౌంటర్‌ లో తెలుగు జవాన్ వీర మరణం !
X
జ‌మ్ముక‌శ్మీర్ రాజోరి జిల్లాలోని సుంద‌ర్‌ బాని సెక్టార్‌ లో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పులలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని గుంటూరు జిల్లా, బాప‌ట్ల‌కు చెందిన యువ జ‌వాను మ‌నుప్రోలు జ‌శ్వంత్ రెడ్డి వీర మ‌ర‌ణం పొందాడు. నిన్న రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. రాజోరిలో కూంబింగ్‌ జరుపుతుండగా కాల్పులకు తెగబడ్డారు తీవ్రవాదులు. సుందర్‌ బనీ సెక్టార్‌ లో జవాన్లు, టెర్రరిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాక్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం మూడు వేర్వేరు ఎన్‌ కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు జవాన్లు. యితే టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు.

వారిలో జశ్వంత్ రెడ్డి కూడా ఉన్నారు. జశ్వంత్‌ రెడ్డి వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌ రెడ్డి ఐదేళ్ల క్రితం సైన్యంలో చేరారు. జశ్వంత్‌రెడ్డి మృతితో దరివాద కొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి. విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 23 ఏండ్ల జశ్వంత్‌ రెడ్డి ఐదేండ్ల క్రితం 2016లో మ‌ద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరారు. తొలుత నీల‌గిరిలో ప‌నిచేసిన ఈయ‌న ప్ర‌స్తుతం జ‌మ్ముక‌శ్మీర్‌ లో విధులు నిర్వ‌హిస్తున్నారు. నాలుగు నెల‌ల క్రితం సెల‌వుల‌కు ఇంటికి వ‌చ్చి వెళ్లారు. మ‌రో నెల‌రోజుల్లో అత‌నికి వివాహం చేసేందుకు కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ లాంచనాలతో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహం బాపట్ల చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నెలలో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇంత విషాదం చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.