Begin typing your search above and press return to search.

జనాలకు పట్టని డిమాండ్ల మీద నిరసనలా అచ్చెన్నా?

By:  Tupaki Desk   |   16 July 2021 3:58 AM GMT
జనాలకు పట్టని డిమాండ్ల మీద నిరసనలా అచ్చెన్నా?
X
కాలం చెల్లిన కాన్సెప్టులతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక చోట సక్సెస్ అయిన ఫార్ములా మరోచోట అంతేలా వర్కువుట్ కావటం సినిమాల్లో సాధ్యమే కానీ రాజకీయాల్లో మాత్రం కుదరదు. ఎందుకంటే.. అక్కడి స్థానిక అంశాలు.. ప్రజల భావోద్వేగాలు ఒకేలా ఉండకపోవటమే కారణం. అధికారంలో ఉన్నప్పుడు తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే తెలుగు తమ్ముళ్లు.. అధికారం చేజారితే మాత్రం కకావికలం అయిపోతారు. అప్పటివరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండే వారు పరార్ అయిపోతుంటారు. పదవుల్ని అనుభవించిన వారు పోలోమని పక్క పార్టీల్లోకి జంప్ కావటం తెలిసిందే. ఇలాంటి వరుస ఎదురుదెబ్బలు.. పార్టీ అధినేత తీరు మొత్తంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

దీనికి తోడు బలమైన ప్రజాకర్షక శక్తి ఉన్న అధినేత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం.. మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న వేళ.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో టీడీపీ నేతలు ఉన్నారని చెప్పక తప్పదు. ఇలాంటి వేళ.. ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి? నిరసనలు చేయటానికి సరైన పాయింట్ పట్టుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంచాయితీ మీద తమ గళాన్ని విప్పేందుకు సాహసించని తెలుగు తమ్ముళ్లు.. ఏదో నాలుగు మాటలు మాట్లాడటమే తప్పించి.. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

తెలంగాణ అధికారపక్షం తీరును.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్న వైనాన్ని ప్రశ్నించటం అధికారపక్షమే తప్పించి.. విపక్షం చేయదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పని తెలుగు తమ్ముళ్లు.. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాల్ని సంధించాలని చూస్తున్న వైనం ఆ పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తోంది. కరోనా వేళలో కంటికి కనిపించకుండా హైదరాబాద్ కే పరిమితమైన అధినేత చంద్రబాబు పుణ్యమా అని కొంత.. పార్టీ నేతల్లో పోరాడే తత్త్వం తగ్గిపోవటం లాంటివి పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.

వాస్తవానికి ఇవాల్టి రోజున పార్టీని నడుపుతున్నది టీడీపీ నేతలు కాదు.. కార్యకర్తలు.. పార్టీ అభిమానులు.. సానుభూతిపరులు మాత్రమే అన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఓపక్క రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా నడుస్తున్న జలవివాదాన్ని పక్కన పెట్టేసి.. పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరల మీద పోరాడాలని డిసైడ్ అయిన టీడీపీ నేతల తీరు చూస్తే.. వారిలో భావ దారిద్ర్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అదే సమయంలో.. తెలంగాణలో కొత్తగా పార్టీ చీఫ్ పదవీ బాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి చేస్తున్న ఆందోళనలతో తెలుగు తమ్ముళ్లు స్ఫూర్తి చెందినట్లుగా కనిపిస్తోంది.

రేవంత్ కు.. తెలుగు తమ్ముళ్లకు మధ్య వ్యత్యాసం చాలానే ఉందన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవీ బాధ్యతలు చేపట్టినంతనే.. పార్టీ నేతల్ని.. పార్టీ క్యాడర్ ను ఉత్సాహ పర్చటానికి వీలుగా పెట్రోల్.. డీజిల్ ధరల పెంపుపై ఆందోళన చేస్తున్నారు. అలా అని అదే అంశాన్ని ఏపీ టీడీపీ నేతలు తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రేవంత్ మాదిరి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేతలు ఏపీ టీడీపీలో ఎవరూ లేరన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అంతేకాదు.. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తే.. కన్వీన్స్ అయ్యే సెక్షన్ ఒకటి ఉంది. కానీ.. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ప్రజలతో కనెక్టు అయ్యే ప్రోగ్రాం చేపట్టాలే కానీ.. రేవంత్ చేస్తున్న పెట్రోల్.. డీజిల్ ధరల పెంపుపై నిరసనను తెలుగు తమ్ముళ్లు యథాతధంగా కాపీ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం వారికి ఎప్పుడు అర్థమవుతుంది?