Begin typing your search above and press return to search.

అమ్మ ప్రేమ..కొడుకు కోసం 1400 కి.మీలు ఒంటరిగా

By:  Tupaki Desk   |   10 April 2020 1:34 PM GMT
అమ్మ ప్రేమ..కొడుకు కోసం 1400 కి.మీలు ఒంటరిగా
X
తల్లి ప్రేమకు కొలమానం లేదు.. వర్ణించడానికి మాటలు చాలవు.. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. అమ్మ ప్రేమకు అంతం లేదని మరోసారి నిరూపితమైంది.

పిల్లల కోసం మనుషులే కాదు.. పశుపక్ష్యాదుల సైతం తల్లడిల్లిపోతాయి. అలానే ఓ మాతృమూర్తి తన బిడ్డ కోసం సాహసమే చేసింది. ఆ తల్లి చేసిన పోరాటానికి ఇప్పుడు అందరూ సలాం కొడుతున్నారు. ఆమె ధైర్యానికి శభాష్ అంటున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ఉపాధ్యాయురాలు రజియా కుమారుడు నిజాముద్దీన్ తన స్నేహితుడి తండ్రి అనారోగ్యంతో ఉండడంతో మార్చి 14న నెల్లూరులోని రెహ్మతాబాద్ కు వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా తిరిగిరాలేక అక్కడే చిక్కుకుపోయాడు.

భర్త కూడా లేని రజియా పిల్లలను ప్రేమగా పెంచుతోంది. కొడుకును చూడకుండా ఉండలేకపోయిన మాతృమూర్తి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేసింది. అవేవీ సఫలం కాకపోవడంతో ఈనెల 6న ఉదయం బోధన్ నుంచి 1400 కి.మీ దూరంలో ఉన్న కొడుకు కోసం స్కూటీపై ఒంటరిగా సాహసయాత్ర చేసింది. పోలీస్ ఉన్నతాధికారి అనుమతి పత్రం తీసుకొని స్కూటీపై ప్రయాణాన్ని ప్రారంభించింది.

కొడుకు మీద ప్రేమతో రాత్రి - పగలు - ఎండ - ఆకలికి సైతం ఒర్చుకొని నెల్లూరుకు చేరుకుంది. ఎక్కడి నిజామాబాద్.. ఎక్కడి నెల్లూరు.. కన్నపేగు కోసం 1400 కి.మీలు ప్రయాణించి కుమారుడిని తెచ్చుకుంది. తన ప్రయాణానికి సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ తల్లి ప్రేమకు ఇప్పుడు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.