Begin typing your search above and press return to search.

సచివాలయానికి తాళం.. ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   28 Sept 2019 11:37 AM IST
సచివాలయానికి తాళం.. ఏం జరగనుంది?
X
ఆసక్తికరమైన ఆదేశాన్ని జారీ చేసింతి తెలంగాణ ప్రభుత్వం. అత్యాధునిక హంగులతో భారీ ఎత్తున సరికొత్త సచివాలయాన్ని నిర్మించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. పాత దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు వీలుగా ఇప్పటికే ఖాళీ చేయటం.. బూర్గుల భవనానికి సచివాలయంలోని పలు శాఖల్ని మార్చటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మౌఖిక ఆదేశాల్ని జారీ చేసింది. సచివాలయ ప్రాంగణాన్ని వెంటనే ఖాళీ చేయాలని పేర్కొంది.నిజానికి.. ఇప్పటికే సచివాలయం మొత్తం ఖాళీ అయ్యింది. నిజానికి అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదు. అయితే.. ప్రాసెస్ లో భాగంగానే తాజా ప్రకటన చేసి ఉంటారని చెబుతున్నారు.

ఇప్పటికే సిబ్బందితో పాటు.. ఫైళ్లు.. సామాగ్రి ఇలా.. అన్నింటిని ఖాళీ చేసేశారు. ఖాళీ చేసిన సచివాలయాన్ని సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది శుక్రవారం బృందాలుగా ఏర్పడి అన్ని బ్లాకుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆదివారం ఉదయం నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి తాళం వేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనుల్ని పూర్తి చేస్తున్నారు.

సచివాలయానికి తాళం వేయటం అంటే.. మరి కొద్దిరోజుల్లోనే.. నిర్మాణాల్ని తొలగించే కార్యక్రమాన్ని మొదలు పెడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సచివాలయానికి తాళం వేయటం కొత్త ఆరంభానికి నాందిగా చెప్పాలి.