Begin typing your search above and press return to search.

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ముహుర్తం పెట్టేశారు

By:  Tupaki Desk   |   13 Jun 2016 4:59 AM GMT
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ముహుర్తం పెట్టేశారు
X
తెలంగాణ సెక్రటేరియట్ ను అత్యాధునికంగా నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను అనుకున్నట్లే అడుగులు వేస్తున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సరికొత్త సచివాలయం పనులకు సంబంధించి కీలకమైన శంకుస్థాపన కార్యక్రమాన్ని దసరా రోజున షురూ చేయాలని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ వాస్తు బాగోలేదన్న నమ్మకంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. పాతదాన్ని పడేసి.. కొత్తది నిర్మించటం తప్ప మరో మార్గం లేనట్లుగా డిసైడ్ కావటమే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. వాస్తు మాటను తెర మీదకు తీసుకురాకుండా.. సచివాలయ భవనాలు పాతవి అయిపోయాయని.. పునరుద్ధరణ పనులకు భిన్నంగా.. మొత్తంగా కూల్చేసి కొత్త భవనాలు నిర్మించాలన్న ఆలోచనను కేసీఆర్ చేయటం తెలిసిందే.

కొత్త సచివాలయం నిర్మాణానికి వీలుగా సెక్రటేరియట్ లో ఇప్పుడున్న భవనాల్ని కూల్చేసి.. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉంది. నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం ఉన్న కార్యాలయాల్ని తరలించాల్సిన నేపథ్యంలో.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. తగిన భవనాల కోసం వెదుకుతున్నారు. ఇదిలా ఉంటే.. సెక్రటేరియట్ లో ఉన్న హెరిటేజ్ కట్టడాల్లో ఒకటైన ‘‘జీ బ్లాక్’’ కూల్చివేతకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. కొత్తగా నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ కు సంబంధించి ముంబయికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ డిజైన్ సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఆమోదించినట్లుగా చెబుతున్న డిజైన్ ను కొత్త సచివాలయంగా నిర్మిస్తే అది ‘‘యూ’’ ఆకారంలో ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో మొత్తం పది బ్లాకులు ఉంటే.. కొత్తగా నిర్మించే సచివాలయంలో ఐదు బ్లాకులు మాత్రమే ఉండనున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం సీ బ్లాక్ ఉన్న స్థానంలోనే సీఎంవో బ్లాక్ ను ఏర్పాటు చేస్తారని.. సీఎంవో బ్లాక్ కు ఇరువైపులా రెండు బ్లాక్ లను నిర్మించనున్నారు.

ప్రతి బ్లాక్ లోనూ ఐదు అంతస్తుల్ని నిర్మించనున్నారు. ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్ కు వెళ్లేందుకు వీలుగా రాకపోకలు సిద్ధం చేస్తున్నారు. ఖాళీ స్థలాలు మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా ఉండాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ సచివాలయం నిర్మాణం దసరాతో మొదలు కానుంది. అయితే.. హెరిటేజ్ భవనం విషయంలో ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే మాత్రం.. ఆ వ్యవహారం కేసీఆర్ ఇమేజ్ కు డ్యామేజ్ గా మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.