Begin typing your search above and press return to search.

జియో ట్యాగింగ్ తో కరోనాపై తెలంగాణ కొత్త పోరు

By:  Tupaki Desk   |   28 March 2020 11:30 PM GMT
జియో ట్యాగింగ్ తో కరోనాపై తెలంగాణ కొత్త పోరు
X
ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు క్వారంటైన్ ఒక్కటే మార్గం. అది కూడా విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు వీలయినంత కాలం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటే.. కరోనా కట్టడికి ఇట్టే అడ్డుకట్ట వేయొచ్చు. ఇదే విషయాన్ని నిన్న కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ కూడా చాలా నిస్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రం ఈ మాట చెవికెక్కడం లేదు. తమకు కరోనా లేదని తమకు తామే చెప్పేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. కరోనాను ఇతరులకు అంటించేస్తున్నారు. ఇలాంటి వారిని ఇట్టే పట్టేయడం తో పాటుగా వారు క్వారంటైన్ లోనే ఉండేలా నిత్యం నిఘా పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఓ బ్రహ్మాండమైన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అదే జియో ట్యాగింగ్.

జియో ట్యాగింగ్ అంటేనే... ఏదో ఓ వ్యక్తి చేతికి ఏదో బ్యాండేజీ కట్టేస్తారని అనుకోవడానికి వీల్లేదు. నిఘా పెట్టిన వ్యక్తుల పూర్తి స్థాయి కదలికలను తెలుసుకునేందుకు... వారి ఇళ్లకు సమీపంలో అప్పటికే అమర్చిన సీసీ కెమెరాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. నిఘాలోని వ్యక్తి ఇంటిలోనే ఉంటే సరేసరి... అలా కాకుండా ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే సదరు సమచారం క్షణాల్లో పోలీసులకు తెలిసిపోతుంది. వెనువెంటనే నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడ వాలిపోతారు. క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన సదరు వ్యక్తిపై పోలీసులు అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయంగా ఉన్న ఈ వ్యవస్థ నిజంగానే తెలంగాణ పోలీసుల పనితీరును మరింత ఉన్నత స్థితికి చేర్చిందని చెప్పక తప్పదు.

తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త అప్లికేషన్‌ ద్వారా ఒక్క రోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్‌లో విదేశాల నుంచి వచ్చిన 22వేల మంది వివరాలను సేకరించారు. వారం రోజుల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారిల కదలికల పరిశీలించారు. అప్లికేషన్ లో నమోదైన వివరాలను జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశారు. ఇంటినుంచి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే.. తక్షణమే పోలీస్ కంట్రోల్ రూంకు ఆటో మెటిక్ గా సమాచారం అందుతుంది. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి పోలీసులు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.