Begin typing your search above and press return to search.

సౌదీలో షాపింగ్ చేస్తూ తుమ్మిన తెలంగాణ వాసి..తరువాత ఏమైందంటే!

By:  Tupaki Desk   |   10 April 2020 11:30 PM GMT
సౌదీలో షాపింగ్ చేస్తూ తుమ్మిన తెలంగాణ వాసి..తరువాత ఏమైందంటే!
X
కరోనా వైరస్ ..ప్రస్తుతం దేశంలోని అన్ని దేశాలకి విస్తరించింది. తాజాగా సౌదీలో తెలంగాణ వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అతడిపై హత్య కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అసలు కరోనా సోకితే ..ట్రీట్ మెంట్ చేయాలి కానీ, హత్య కేసు నమోదు చేస్తారా? అని ఆలోచిస్తున్నారు కదా! అయితే , అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం ...

తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో సర్వేయర్‌ గా పనిచేస్తున్నాడు. సెలవులపై ఇటీవల స్వదేశానికి వచ్చి.. కొద్దిరోజుల ముందే మళ్లీ సౌదీకి వెళ్ళాడు. ఆ తరువాత ఒకరోజు నిత్యావసరాల కోసం ఓ ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ కు వెళ్లాడు. అక్కడ పదేపదే తుమ్ముతూ.. దగ్గుతూ కనిపించిన ఆ ప్రవాసీయుడిని.. అరబ్బు కుటుంబానికి చెందిన ఓ బాలిక గమనించింది. అతను తుమ్మిన సమయంలో తుంపర్లు షాపింగ్‌ ట్రాలీపై పడటం - ఆ ట్రాలీ హ్యాండిల్‌ ను అతడు పట్టుకోవడం - ఇదంతా చూసిన ఆ బాలిక అక్కడే ఉన్న తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వారి సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు - వైద్య పరీక్షల నిమిత్తం ఆ ప్రవాసీయుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వెంటనే స్పందించిన మునిసిపల్‌ అధికారులు సూపర్‌ మార్కెట్‌ లో పూర్తిగా క్రిమి సంహారక మందును స్ర్పే చేశారు. అతడు తాకిన ర్యాకుల్లోని రూ. 35 లక్షల విలువై సామగ్రిని కాల్చేశారు. అలాగే అతడితో కలిసి క్యాంపులో ఉంటున్న మరో 47 మంది విదేశీ కార్మికులను క్వారంటైన్‌ కు తరలించారు. వారిలో 44 మందికి నెగెటివ్‌ అని తేలడంతో ఈనెల 8వ తేదీన డిశ్చార్జి చేశారు. అయితే , అతడు ఉద్దేశపూర్వకంగానే ఈ వైరస్ ను వ్యాప్తి చేసి.. ప్రాణ నష్టం కలిగిస్తున్నాడని తేలితే.. ఆ ప్రవాసీయుడిపై హత్య కేసు పెడతామని అధికారులు చెప్తున్నారు. అయితే , ఇటీవలే ఇండియా వెళ్లి తిరిగివచ్చిన ఆ యువకుడికి.. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే కరోనా ఉన్నట్లు తెలిసిందని అతని మిత్రులు చెప్పారు.