Begin typing your search above and press return to search.

వైద్యం మీరు చేయండి.. ఎంత బిల్లు వేయాలో మేం చెబుతాం

By:  Tupaki Desk   |   6 March 2020 4:12 AM GMT
వైద్యం మీరు చేయండి.. ఎంత బిల్లు వేయాలో మేం చెబుతాం
X
భయానికి మించిన రోగం మరేది ఉండదు. ఆ విషయం మనిషికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ఎంత భయం పుట్టిస్తే అదెన్ని కాసులు కురిపిస్తుందన్న వైనం తాజాగా కరోనా పుణ్యమా అని తెలిసి వచ్చే పరిస్థితి. నిత్యం నీతులు చెప్పే వారు సైతం.. కరోనా లాంటివి వస్తుందన్న మాట వినిపించినంతనే.. దాన్ని సొమ్ము చేసుకోవటానికి ఉన్న అవకాశాల్ని వెతికేస్తుంటారు. కరోనాకు వైద్యం చేయటానికి వీలుగా ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వటమే కాదు.. ఎవరెవరు.. ఎన్ని బెడ్లు సిద్ధం చేయాలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే.

ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయటమంటే.. బిల్లు ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో కరోనా వైద్యానికి అయ్యే బిల్లుకు సంబంధించి ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేయటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎవరైనా కోవిడ్ అనుమానంతో చేరితే.. వారికి వైద్యం చేసే విషయంలో తాము జోక్యం చేసుకోం కానీ.. కోవిడ్ ఉన్నట్లు తేలితే మాత్రం.. బిల్లు ఎంత ఉండాలన్న విషయంపై తాము చెబుతామని.. ఆ మేరకు మాత్రమే బిల్లు ఉండాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ తో పాటు.. చుట్టుపక్కల ఉన్న ప్రముఖమైన కార్పొరేట్ ఆసుపత్రులతో సహా మొత్తం 70-80 ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యానాలతో సమావేశాన్ని నిర్వహించిన ఈటెల.. కోవిడ్ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయటాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని చెప్పటంతో పాటు.. ఫీజుల్ని తామే స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పారు.
కోవిడ్ కు సంబంధించిన అంశాల్లో ఆసుపత్రులు.. అందులో పని చేసే సిబ్బంది ఎలా వ్యవహరించాలన్న విషయంపై ప్రోటోకాల్ ను ఆయన వెల్లడించారు. ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాల్సిన ఐసోలేషన్ వార్డులతో పాటు.. ఓపీలో చేసుకోవాల్సిన మార్పుల గురించి ఈటెల వివరంగా చెప్పుకొచ్చారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో పని చేసే సిబ్బందికి అదనపు వేతనంతో పాటు.. సర్టిఫికేట్లను ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో కరోనా భయం అంతకంతకూ పెరిగే వేళ.. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా మంత్రి ఈటెల లాంటి వారి మాటలు కీలకంగా మారతాయనటంలో సందేహం లేదు.