Begin typing your search above and press return to search.

శ్రీశైలం పేలుళ్ల కేసును సీఐడీకి అప్పగించిన తెలంగాణ

By:  Tupaki Desk   |   21 Aug 2020 4:40 PM GMT
శ్రీశైలం పేలుళ్ల కేసును సీఐడీకి అప్పగించిన తెలంగాణ
X
శ్రీశైలం రిజర్వాయర్‌లో తెలంగాణ వైపున ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఆరుగురు చనిపోగా.. ముగ్గురి కోసం వెతుకుతున్నారు. శ్రీశైలంలో పేలుళ్లపై రాజకీయ విమర్శలు కూడా చెలరేగాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ పేలుళ్ల వెనుక దురుద్దేశాలున్నాయని.. ఏపీకి నీటి సరఫరా కోసమే ఇలా చేశారని తెలంగాణ సర్కార్ పై ఆరోపణలు గుప్పించారు. దీనివెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలోనే శ్రీశైలం పేలుళ్లను సిఐడికి అప్పగిస్తూ సమగ్ర దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది.

సిఐడి అదనపు పోలీసు డైరెక్టర్ గోవింద్ సింగ్‌ను ప్రమాదానికి గల కారణాలు.. వ్యవస్థలో లోపాలను విచారించడానికి విచారణ అధికారిగా నియమించారు. నివేదికను త్వరగా సమర్పించాలని కోరారు.

శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ స్పందించారు. 9 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటన అని అభివర్ణించిన కెసిఆర్.. ఈ పవర్ హౌస్ లో చిక్కుకున్న ఇంజనీర్లను రక్షించి సజీవంగా బయటకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశారని, కానీ ఫలించలేదన్నారు. దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

900 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లోని రెండు కిలోమీటర్ల పొడవైన సొరంగంలో ఉన్న పవర్ హౌస్ ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది ఇంజనీర్లు చిక్కుకున్నారు. ఆరుగురిని రక్షించగా, మరో 15 మంది ప్లాంట్ నుంచి అత్యవసర ఎగ్జిట్ మార్గం ద్వారా బయటకు రాగలిగారు.

లోపల చిక్కుకున్న తొమ్మిది మందిలో ఆరు మృతదేహాలను మధ్యాహ్నం 3.30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ఇంజనీర్ల కోసం శోధిస్తున్నారు. ఈ ప్రమాదంలో వారు చనిపోయారని భావిస్తున్నారు.