Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను తిట్టి కాంగ్రెస్ ఎందుకు కామెడీ చేస్తోందో!

By:  Tupaki Desk   |   6 Oct 2017 7:29 AM GMT
కేసీఆర్‌ ను తిట్టి కాంగ్రెస్ ఎందుకు కామెడీ చేస్తోందో!
X
రాజ‌కీయాల్లో మ‌నం అనే ఒక్క‌మాట తిరిగి మ‌న‌కు వంద ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యేలా చేస్తుంద‌నేది బేసిక్ సిద్ధాంతం. అందుకే ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు కొంద‌రు...మ‌రికొంద‌రు అవేమీ ప‌ట్ట‌కుండా చెల‌రేగిపోతుంటారు. కానీ ఒక విమర్శ‌ను పదే ప‌దే ప్ర‌త్య‌ర్థిపై సంధిస్తున్న‌ప్పుడు అదే మాట తిరిగి మ‌న‌కు స‌మ‌స్య‌గా మారకుండా చూసుకోవాలి. కానీ తెలంగాణ‌లో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీకి ఈ ఆలోచ‌న‌ను ప‌క్క‌న‌పెట్టేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు వాస్తు పిచ్చి పట్టుకుందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం కూడా అదే దారిన పయనిస్తోందని అంటున్నారు.

వాస్తు అంటే విప‌రీత‌మైన న‌మ్మ‌కం ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌....వాస్తు బాగోలేదని కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ నిర్ణ‌యంపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది, పోస్తోంది కూడా! అయితే తిరిగి అదే ప‌ని కాంగ్రెస్ చేస్తోంది. హైద‌రాబాద్‌ లోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ ప్రవేశ ద్వారాన్ని మార్పు చేసింది. చాలా కాలంగా పడమర దిక్కున ఉన్న గేటు ద్వారా గాంధీభవన్‌ లోపలికి నేతలు వస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరం దిక్కున మూసి ఉన్న గేట్‌ ను తెరిపించి దాని ద్వారా నడుస్తున్నారు. ఈ గేట్‌ గుండా నడిస్తేనే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని కొంతమంది జ్యోతిష్కులు చెప్పిన ఆధారంగా మార్పుదల చేసినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో ఉత్తరం దిక్కున ఉన్న ప్రవేశద్వారాన్ని మూసివేయడం వల్ల పార్టీకి అనేక అనర్థాలు జరిగాయని అంటున్నారు. దీంతో జ్యోతిష్యులు సూచనలతో ఉత్తరం దిక్కు నుంచి లోపలికి వస్తున్నట్టు అంటున్నారు.

ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు వాస్తు భయం గుర్తుకు రావడం సర్వసాధారణంగా ఉంటుంది. చాలా మంది ముఖ్య నేతలు వాస్తు దోషాలను సవరించుకుంటారు. ఇప్పుడు అదే బాటలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. ఇందుకోస‌మే గాంధీభ‌వ‌న్ ప‌క్క‌న గతంలో మూసివేసిన పెట్రోల్‌ బంకు పక్కన ఉన్న గేట్‌నూ తెరిచారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు కూడా వాస్తు దోషం ఉందని చెప్పితే పడమర ద్వారా నుంచి వచ్చి ఉత్తర దిశ నుంచి వెళ్లినప్పటికీ ఆయన పదవి గండం నుండి తప్పించుకోలేకపోయారు. కేడర్‌ లో ఉత్సాహాన్ని నింపకుండా పైపై మెరుగులు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదని, పదవులను, అధికారాన్ని వాస్తులు కాపాడలేవని కొంతమంది కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. ఈ బేసిక్ పాయింట్ వదిలేసిన కాంగ్రెస్ పార్టీ వాస్తు వెనుక ప‌డ‌టం ఆస‌క్తిక‌ర‌మే.