Begin typing your search above and press return to search.

ఆ విషయంలో కేసీఆర్ దే రికార్డంటున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   23 Jun 2016 11:58 AM GMT
ఆ విషయంలో కేసీఆర్ దే రికార్డంటున్న కాంగ్రెస్
X
తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల పర్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణలో మొదలైన ఈ ఫిరాయింపులు ఏపీకి కూడా పాకి ఉవ్వెత్తున సాగాయి. అయితే... మొత్తం ఫిరాయింపుల లెక్కలు తీస్తే తెలంగాణలోనే ఎక్కువట. తెలుగు రాష్ర్టాల్లోనే కాదు, అసలు ఇండియాలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలోను లేని స్థాయిలో టీఆరెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలను టీఆరెస్ ఎత్తుకెళ్తుండడంతో రగులుతున్న కాంగ్రెస్ పార్టీ టీఆరెస్ తీరుపై శాసనమండలి ఛైర్మన్ కు కంప్లయింట్ చేశారు.

కేసీఆర్ తన 25 నెలల పాలనలో 47 మంది ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన వారిని చేర్చుకుని ఫిరాయింపుల్లో ఎవరికీ అందనంత ఎత్తునకు ఎదిగి రికార్డును సృష్టించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయంలో టీఆరెస్ పార్టీ ఫిరాయింపుల రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఫరూఖ్ హుస్సేన్ - ఎంఎస్ ప్రభాకర్ లను అనర్హులుగా ప్రకటించాలని గురువారం మండలి చైర్మన్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆ పార్టీ నేతలుమీడియాతో మాట్లాడారు. 47 మందిని టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేసిన ఆయన, ఈ తరహా ఫిరాయింపులు తెలుగు రాష్ట్రాల్లో తప్ప మరెక్కడా లేవన్నారు.

టీఆరెస్ విధానాలు దారుణంగా ఉన్నాయని.. ఫిరాయింపు నేతలు కూడా రంగులు మార్చే ఊసరవెల్లుల్లా తయారవుతున్నారని.. అలాంటి నేతలు ప్రజాస్వామ్యంలో ఉండరాదని అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ - విద్యుత్ ఛార్జీల పెంపుపైనా కాంగ్రెస్ విరుచుకుపడింది. కేసీఆర్ చెప్పినట్టుగా చార్జీలను పెంచితే, తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణను మిగులు రాష్ట్రంగా - ధనిక రాష్ట్రంగా చెబుతున్న కేసీఆర్ ప్రజలపై ఛార్జీల భారం ఎలా మోపుతారని ప్రశ్నిస్తున్నారు.