Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ ఫైనల్ కు టీమిండియా ఫ్యాన్స్ షాక్!

By:  Tupaki Desk   |   13 July 2019 8:20 AM GMT
ప్రపంచకప్ ఫైనల్ కు టీమిండియా ఫ్యాన్స్ షాక్!
X
ఎలాగూ న్యూజిలాండ్ ను టీమిండియా ఓడించి తీరుతుంది, కచ్చితంగా ఫైనల్ కు చేరుతుంది.. అనే అంతా అనుకున్నారు! ఈ విషయంలో న్యూజిలాండ్ కూడా ఒప్పుకుంది. తాము అండర్ డాగ్స్ గా మాత్రమే బరిలోకి దిగుతున్నట్టుగా న్యూజిలాండ్ క్రికెటర్లు మ్యాచ్ కు ముందే ప్రకటించుకున్నారు. తొలి సెమిఫైనల్ కు టీమిండియానే ఫేవరెట్ అని వారు ప్రకటించుకున్నారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్- విశ్లేషకులు- మాజీ క్రికెటర్లు కూడా ప్రపంచకప్ ఫైనల్ కు చేరేది టీమిండియా అనే అంచనాలతోనే ఉండినారు. దానికి భారతీ క్రికెట్ ఫ్యాన్స్ కూడా మినహాయింపు కాదు! అందుకే లార్డ్స్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం భారీ ఎత్తున టికెట్లను కొనేసుకున్నారు భారతీయ క్రికెట్ ఫ్యాన్స్. లండన్ లో భారీ ఎత్తున భారతీయులు ఉంటారు. దాంతో పాటు బోలెడంతమంది ప్రపంచకప్ ను మైదానాల్లో చూడటానికి వెళ్లారు. అలాంటి వారంతా ఫైనల్ మ్యాచ్ టికెట్లను పోటీలు పడి కొనేశారు! మొత్తం టికెట్ల దాదాపు సగం వరకూ భారతీయ క్రికెట్ ఫ్యాన్సే కొనేసి ఉంటారనేది ఒక అంచనా. టీమిండియా ఫైనల్ చేరుతుందనే నమ్మకమే దానికి కారణం. వారి నమ్మకం నిజం కాలేదు. భారత జట్టు సెమిస్ నుంచి తిరుగు ముఖం పట్టింది.

ఫైనల్ మ్యాచ్ ను ఇంగ్లండ్- న్యూజిలాండ్ లు ఆడబోతూ ఉన్నారు. అసలు మన జట్టు ఓడిపోయిన బాధలో ఉన్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ లు ఫైనల్ ఆడుతుంటే చూడానికి మైదానాలకు వెళ్లే ఉత్సాహం వీరికి ఉండరు. అందుకే ఇప్పుడు తమ టికెట్లను వేరే వాళ్లకు అమ్మేస్తామని వారు అంటున్నారట. అయితే రీసేల్ కు వీల్లేదని ఐసీసీ అంటోంది.

భారతీయులకు ఆసక్తి లేకపోవడంతో ఫైనల్ మ్యాచ్ ను మైదానానికి వచ్చి చూసే వాళ్లు కూడా తక్కువే అయిపోతారు. రీ సేల్ వీల్లేదంటే.. టికెట్లు వ్యర్థం కావడం తప్ప జరిగేదేం ఉండదని పరిశీలకులు అంటున్నారు.