Begin typing your search above and press return to search.

తరగతి గదిలో టీచర్ క్షుద్ర పూజలు ... ఎందుకో తెలుసా !

By:  Tupaki Desk   |   3 Feb 2020 3:06 PM IST
తరగతి గదిలో టీచర్ క్షుద్ర పూజలు ... ఎందుకో తెలుసా !
X
ఏపీలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులతోనే క్షుద్రపూజలకు ప్రారంభించాడు. ఓ విద్యార్థినికి చెవి కమ్మలు పోయాయన్న కారణంతో క్షుద్రపూజలు చేయించాడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిందీ ఘటన. విద్యార్థిని చెవికమ్మలు పోయిన విషయం ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తెలిసింది. దీంతో మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే దొంగ దొరుకుతాడని, ఆదివారం తలస్నానం చేసి స్కూలుకు రావాలని విద్యార్థులకు చెప్పాడు. దీంతో అందరూ తల స్నానం చేసి స్కూలుకు వెళ్లారు.

అప్పటికే అక్కడ మంత్రగాడు రమణ తో ఉపాధ్యాయుడు రవికుమార్ సిద్ధంగా ఉన్నాడు. విద్యార్థుల చేతి గోళ్లపై పసరు రాసి మంత్రం పఠిస్తున్న సమయంలో ఓ విద్యార్థి తాత స్కూలుకు వచ్చాడు. దీంతో అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూశాడు. పిల్లలతో ఏం చేయిస్తున్నారని ప్రశ్నించడంతో వాళ్లిద్దరు కంగారుపడ్డారు. విషయం తెలిసిన గ్రామస్థులు స్కూలుకు రావడంతో మంత్రగాడు రమణ అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో ఉపాధ్యాయుడు నిర్వాకం పై ఆగ్రహించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్కూల్‌కు వచ్చిన పోలీసులు ఉపాధ్యాయుడును అదుపులోకి తీసుకున్నారు. తమకు ఏదో ఆకు పసరు పూశారని, ఆ తర్వాత తల తిరిగినట్టు అయిందని విద్యార్థులు తెలిపారు. బడిలో క్షుద్రపూజలపై స్పందించిన ఎంఈవో చక్రేనాయక్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని భావితరాలకు పాఠాలు నేర్పాల్సిన టీచర్, ఇలాంటి ఘటనకు పాల్పడటంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.