Begin typing your search above and press return to search.

అమెరికాలోని 40 న‌గ‌రాల్లో.. టీడీపీ వేడుక‌లు

By:  Tupaki Desk   |   29 March 2022 3:30 PM GMT
అమెరికాలోని 40 న‌గ‌రాల్లో.. టీడీపీ వేడుక‌లు
X
తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగుదేశం పార్టీకి నేటితో 40 వ‌సంతాలు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో దేశంలోనే కాకుండా..విదేశాల్లోని తెలుగువారు.. పార్టీపై అభిమానం కురిపించారు. ముఖ్యంగా అమెరికాలోని 40 న‌గ‌రాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. ఎన్నారై తెలుగుదేశం అమెరికా విభాగం ఆధ్వ‌ర్యంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని అమెరికా వ్యాప్తంగా 40 న‌గ‌రాల్లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, తెలుగు మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డైట్రాయిట్ తెలుగుదేశం కౌన్సిల్ మెంబ‌ర్స్ మాట్లాడుతూ ఎన్టీఆర్ త‌రువాత ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు నేతృత్వంలో పార్టీ తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచిపోయేలా ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని గుర్తుచేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నలభై ఏళ్ల క్రితం ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఒక చారిత్రక అవసరంగా గుర్తింపు పొందింద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన జూమ్ యాప్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుండి టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, రాష్ట్ర స్థాయి నేత‌లు పాల్గొని ప్ర‌సంగించారు.

జూమ్ యాప్‌లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌, తాడిప‌త్రి ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ‌కుమార్‌, టీడీపీ అఫిషియ‌ల్ స్పోక్స్‌ప‌ర్స‌న్ గొట్టిపాటి వెంక‌ట రామ‌కృష్ణ ప్ర‌సాద్ పాల్గొని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల‌ల్లో ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు సేవ‌ల‌ను కొనియాడారు. చంద్ర‌బాబును మ‌ళ్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని చేసేందుకు అహ‌ర్నిశ‌లు పాటుప‌డ‌తామ‌ని చాటారు. కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం ప్ర‌తి నాయ‌కుడు త‌మ శ‌క్తి మేర‌కు కృషి చేయాల‌ని కోరారు. కాగా, అమెరికాలోని డెట్రాయిట్‌లో భారీ ఎత్తున కార్ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు.