Begin typing your search above and press return to search.

ఆ బీజేపీ ఎంపీని చూస్తే టీడీపీ నేతలకు ఎందుకంత భయం?

By:  Tupaki Desk   |   8 Aug 2018 4:08 AM GMT
ఆ బీజేపీ ఎంపీని చూస్తే టీడీపీ నేతలకు ఎందుకంత భయం?
X
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అంటే టీడీపీ నేతలు బాగా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ - అమిత్ షా - కన్నా లక్ష్మీనారాయణ - సోము వీర్రాజుల కంటే కూడా జీవీఎల్‌ నే టీడీపీ నేతలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన్ను కొట్టినంత పనిచేశారట. ఆయన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా నీకేం తెలుసు అంటూ అవమానకరంగా మాట్లాడారాని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ... సోషల్ మీడియాలో లైవ్‌ లు ఇస్తూ ఏపీకి కేంద్రం ఏం చేసిందో చెబుతుండడమే కాకుండా టీడీపీ చెబతున్న విషయాల్లో అవాస్తవాలను ఎప్పటికప్పుడు బయటపెడుతుండడం.. ఇటీవల ప్రయివేటు అకౌంట్ల గుట్టును బయటపెట్టడం.. ఏపీ సంగతులను కేంద్రంలోని పెద్దలకు ఎప్పటికప్పుడు చేరవేస్తుండడంతో ఆయన్ను చూసి టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని వినిపిస్తోంది.

విశాఖ రైల్వే జోన్ కోసం మంగళవారం టీడీపీ ఎంపీలు - ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు కలిసి రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ ను కలిశారు. ఈ సమావేశం ఉద్రిక్తంగా మారింది. కేంద్రమంత్రితో పాటు ఆ సమావేశంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు - విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఉండడంతో టీడీపీ ఎంపీల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఆయన మాట్లాడుతుంటే వారు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ అందరూ కలిసి విరుచుకుపడ్డారు. మంత్రిని అడుగుతుంటే సమాధానం చెప్పడానికి మీరెవరంటూ ఆయన్ను కసురుకున్నారట.

టీడీపీ ఎంపీల తరపున అశోక్‌ గజపతి రాజు - ఏపీ మంత్రుల తరపున సుజయకృష్ణ రంగారావు - స్థానిక ఎంపీ హోదాలో అవంతి శ్రీనివాస్ రైల్వేజోన్ పై మాట్లాడారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ను ప్రకటించాలని మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.350 కోట్లు ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకుందని ఆరోపించారు. దీంతో కలగజేసుకున్న జీవీఎల్.. టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని లేచారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి ఆయనపై విరుచుకుపడ్డారు. ఏపీ గురించి మాట్లాడడానికి మీరెవరని నిలదీశారు. రాష్ట్రం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని - మంత్రిని అడుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జీవీఎల్ కూడా అంతేస్థాయిలో వారిపై ఎదురుదాడికి దిగారు.

సుజనా చౌదరి మాట్లాడుతూ.. తాము కేంద్రమంత్రికి వినతిపత్రం ఇచ్చి సమస్యలు విన్నవించడానికి వచ్చామని - ఆయనే తమకు వివరణ ఇస్తారని - మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. అసలు ఏ హోదాతో మాట్లాడుతున్నారని, మీకే హక్కు ఉందని మండిపడ్డారు. కళా వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ కు ద్రోహం చేయాలని చూస్తే రాష్ట్రంలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. దీంతో జీవీఎల్ మరింత రెచ్చిపోయారు. ‘నువ్వేం చేస్తావ్?’ అని కళాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడి తీరుతానని చెప్పడంతో టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో మాటామాటా పెరిగి సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు పీయూష్ గోయల్ - హరిబాబు - సుజనా చౌదరి కల్పించుకుని రెండు వర్గాలకూ సర్దిచెప్పారు.