Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ కి కొత్త ఐడియాలు ఇస్తున్న తమ్ముడు

By:  Tupaki Desk   |   23 Sep 2015 9:07 AM GMT
మోడీ బ్యాచ్ కి కొత్త ఐడియాలు ఇస్తున్న తమ్ముడు
X
ఏమైనా రాజకీయ నేతలు రాజకీయ నేతలే. వారికొచ్చే ఐడియాలు చూసి మురిసిపోవాల్సిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా చెలరేగిపోయే వారి ఉత్సాహం చూస్తే ఎంత ఎనర్జీ అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

అప్పుడెప్పుడో మౌన ప్రధాని మన్మోహన్ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మసి.. చెరిగిపోకుండా తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఈ మధ్యనే ఈ వ్యవహారంలో ఇరుక్కున్న నాటి సహాయమంత్రి దాసరి నారాయణరావు అయితే.. ఏకంగా నాటి తమ నాయకుడు మన్మోహన్ సింగ్ మీద ఆరోపణలు చేసేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి తమపై చేస్తున్న ఆరోపణల్లో తన బాధ్యత ఏమీ లేదని.. వివాదాస్పద కేటాయింపులన్నీ మన్మోహన్ తనకు తానుగా తీసుకున్నవని.. కావాలంటే ఆయన పేరును నిందితుల జాబితాలో పెట్టాలంటూ పేర్కొని సంచలనం సృష్టించారు.

విపక్షాలు సైతం మన్మోహన్ పై ‘అవినీతి’ ఆరోపణలు చేయటానికి కూడా ఇష్టపడతారు. అదేం చిత్రమో కానీ.. ఆయన క్యాబినెట్ లో మంత్రిగా పని చేసిన దాసరి మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా మన్మోహన్ ను బాధ్యుడ్ని చేసేయాలని కోరేయటమే కాదు.. లిఖితపూర్వకంగా రాసిచ్చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం మరో కొత్త వాణిని వినిపిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ పేరు చేర్చటం కంటే కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేరును చేర్చాలని సోమిరెడ్డి సరికొత్త డిమాండ్ చేస్తున్నారు. ఆసక్తికరంగా దాసరి చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన సోమిరెడ్డి.. మన్మోహన్ కు ఇలాంటి కుంభకోణాల్లో సంబంధం ఉండదని.. ఆయన్ని విచారించటం సరికాదని చెప్పిన ఆయన.. యూపీఏ సర్కారుకు అన్నీ తానై వ్యవహరించిన సోనియాగాంధీని విచారించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి ఈ విషయం కాని మన్మోహన్ వింటే కాసింత సంతోషపడతారేమో? తన మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి తనను విచారించాలంటే.. తమ పార్టీ అంటేనే మండిపడే సీనియర్ నేత మాత్రం సింగ్ గారి నిజాయితీని గుర్తించటానికి మించిన ఉపశమనం ఇంకేం ఉంటుంది..?