Begin typing your search above and press return to search.

పాపం.. దీప‌క్ రెడ్డి చాలా అమాయ‌కుడ‌ట‌

By:  Tupaki Desk   |   7 Jun 2017 10:59 AM GMT
పాపం.. దీప‌క్ రెడ్డి చాలా అమాయ‌కుడ‌ట‌
X
భూఅక్రమాల కేసులో సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి తాను అమాయ‌కుడిన‌ని చెప్పుకొస్తున్నారు. త‌న‌పై వచ్చిన ఆరోప‌ణ‌ల‌తో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని.. త‌న సంత‌కాలు ఫోర్జరీ చేశార‌ని ఆయ‌న అంటున్నారు. కాగా దీప‌క్ రెడ్డిని, ఆయనకు సహకరించిన న్యాయవాది శైలేంద్ర సక్సేనాను పోలీసులు ఇప్ప‌టికే చంచల్‌ గూడ జైలుకు తరలించారు.

దీపక్ రెడ్డిపై గతంలో ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్ - బంజారాహిల్స్‌ తో పాటు హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో దీపక్‌ రెడ్డికి 15 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నట్లు ఆరోప‌ణ‌లున్నాయి. దొంగ పత్రాలు సృష్టించి ఎన్నో ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే చోట దీపక్‌ రెడ్డికి 3 వేల 128 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. 2012 ఉప ఎన్నికలో రాయదుర్గం (అనంత‌పురం) నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపక్‌ రెడ్డి... 2017లో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అయితే 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో 6 వేల 781 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్లు అఫిడవిట్ సమర్పించాడు.

తాజా ఆరోప‌ణ‌ల సంగ‌తి చూస్తే... హైద‌రాబాద్ లోని బంజారాహిల్స్‌ - ఆసిఫ్‌ నగర్‌ లో రూ.165 కోట్ల విలువైన భూఅక్రమాలకు పాల్పడ్డారని దీపక్‌ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. హైదరాబాద్‌ లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్‌ కమల్‌ అనే శరణార్థికి చెందిన 3.37 ఎకరాల భూమి బంజారాహిల్స్‌ లో ఉండగా.. 1960లో ఎంవీఎస్‌ చౌదరి అండ్‌ బ్రదర్స్‌ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి అధీనంలోనే ఉంది. అక్బర్‌ మొహినుద్దీన్‌ అన్సారీ, ఖజా మొహినుద్దీన్‌ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమికి యజమానులుగా 2008లో సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. వారి నుంచి దీపక్‌ రెడ్డి, తానూ ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలు తయారు చేశారు. తమ భూమిని చౌదరి అండ్‌ బ్రదర్స్‌ కబ్జా చేశారంటూ శైలేష్‌ సక్సేనా.. భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో ఉండగా.. కొద్ది నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను కోర్టులో సమర్పించారు. అనంతరం బంజారాహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా... పోలీసులు ఈ కేసును సీసీఎస్‌ కు బదిలీ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థిక నేరాల విభాగం.. సక్సేనా తదితరులతో పాటు అయిదో నిందితుడిగా దీపక్‌ రెడ్డిపై కేసు నమోదు చేసింది.

ఆసిఫ్‌ నగర్‌ లోనూ భూములను అక్రమంగా సొంతం చేసుకునేందుకు శైలేష్‌ సక్సేనా పథకం వేయగా.. దీపక్‌ రెడ్డి ఆర్థిక సహకారాన్ని అందించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆసిఫ్‌ నగర్‌ లో ఒక సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సక్సేనా ఏడేళ్ల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగానే.. ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల భూమిని నిజాం నవాబు తమకు ఇనాంగా ఇచ్చారంటూ కొన్ని పత్రాలను సమర్పించాడు. ఈ రెండింటినీ సమగ్రంగా విచారించాలంటూ న్యాయస్థానం ఆదేశించడంతో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను న్యాయస్థానానికి సమర్పించి పోలీసులకూ ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు సక్సేనావి కావని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కేసు నమోదుచేయడంతో సక్సేనా పారిపోయాడు. అదేక్రమంలో తన కాపాలాదారుడిని హైదరాబాద్‌ కు చెందిన సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి ఠాణాలో దీపక్‌ రెడ్డి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదు బోగస్‌ అని విచారణలో తేలింది.

ఇవి కాకుండా దీప‌క్ రెడ్డిపై ఇత‌ర కేసులూ ఉన్నాయి. బెదిరింపులు - దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ రెండు కేసులు, అక్రమణలకు పాల్పడ్డాడంటూ మరొక కేసు, దాడి - మారణాయుధాల కేసులూ ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/