Begin typing your search above and press return to search.

వైసీపీ లోకి టీడీపీ ఎమ్మెల్యే? పచ్చ పార్టీ కి ఊహించని షాక్

By:  Tupaki Desk   |   30 Dec 2019 10:53 AM GMT
వైసీపీ లోకి టీడీపీ ఎమ్మెల్యే? పచ్చ పార్టీ కి ఊహించని షాక్
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. అటు పార్టీపై ఇటు నాయకుల పై ఆయన కమాండ్ పోతోంది. ప్రజల్లోనూ నమ్మకం సడలుతోంది. నేతలు ఒక్కరొక్కరు టీడీపీలో భవిష్యత్తు లేదని జారిపోతుంటే ఆందోళన పెరిగిపోతోంది..

ఇప్పటికే టీడీపీ ని అనాధిగా నమ్ముకొని ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబుకు షాకిచ్చి జగన్ కు జైకొట్టి తిరుగుబాటుచేశారు. ఆయన బాటలోనే దేవినేని అవినాష్ షాక్ ఇచ్చారు. ఈ రెండు ఉపద్రవాల నుంచి కోలుకోకముందే మరో టీడీపీ ఎమ్మెల్యే మద్దాళి గిరి సీఎం జగన్ తో భేటి కావడంతో పచ్చపార్టీకి ఊహించని షాక్ తగిలినట్టైంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మద్దాళి గిరి చంద్రబాబుకు షాకిచ్చారు. ఆయన సోమవారం సీఎం జగన్ తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గిరి వైసీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే వైసీపీలో చేరాలంటే రాజీనామా చేయాలన్న జగన్ షరతులు ఉండడంతో ఈయనను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాగానే పార్టీ ఫిరాయించి సపరేట్ గా కూర్చుండబెట్టి టీడీపీ కి దూరం చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీలో చేరడంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. వెల్లంపల్లి సామాజిక వర్గానికి చెందిన మద్దాళి గిరి చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండి మరీ జగన్ కలవడం విశేషంగా మారింది.

అమరావతి తరలింపుపై చంద్రబాబు, టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేను లాగేసి చంద్రబాబు వాదన తప్పు అని నిరూపించడానికి వైసీపీకి ఈ ఎమ్మెల్యే ఫిరాయింపు గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

ఇక మద్దాళిగిరి టీడీపీని ఫిరాయింపచేసి వల్లభనేని వంశీలాగానే ఎమ్మెల్యేగా స్వతంత్రుడిగా.. వైసీపీకి మద్దతుదారుడిగా నిలిపేలా వైసీపీ అధిష్టానం ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తోంది. స్వతంత్ర్య ఎమ్మెల్యేగానే ఆయన వైసీపీకి మద్దతిచ్చేలా ప్లాన్ చేయబోతోందట.. చూడాలి మరీ అమరావతిపై పోరాడుతున్న టీడీపీకి ఆ ప్రాంత ఎమ్మెల్యే పార్టీ మారడం నిజంగా గొప్ప షాక్ గా మారిందని పరిశీలకులు అంటున్నారు..