Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై మంత్రుల అసంతృప్తి!!

By:  Tupaki Desk   |   24 Sept 2016 12:52 PM IST
చంద్రబాబుపై మంత్రుల అసంతృప్తి!!
X
మొన్న ఢిల్లీలో కృష్ణా జలాల పంపిణీ విషయంలో జరిగిన అపెక్స్ కమిటీ భేటీలో చంద్రబాబు విఫలమయ్యారని ఏపీ మంత్రులు గుసగుసలాడుకుంటున్నారు. భేటీలో తెలంగాణ ప్రభుత్వం కంటే ఏపీ బాగా వెనుకబడిపోయిందని మంత్రులు తెగ ఫీలవుతున్నారట. ఢిల్లీలో బాబు-కేసీఆర్ సమావేశంలో ఆంధ్ర వాదనలను తప్పని నిరూపించడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమయిందన్న ప్రచారం జరిగిందే తప్ప, తాము సమర్థవంతంగా వినిపించిన వాదనలకు తగిన ప్రచారం లభించకపోవడంపై సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో ఢిల్లీలో తాము మీడియాను ఆకట్టుకోలేకపోయామన్న విషయం స్పష్టమవుతుందని అంగీకరిస్తున్నారు. బాబు-కేసీఆర్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ఏమేమి వాదనలు వినిపించనున్న అంశాలను తెరాస కొద్దిరోజుల ముందు నుంచే మీడియాకు రూపంలో ప్రకటనలు విడుదల చేయగా, తాము మాత్రం ఆ పని చేయడంలో విఫలమయ్యామని చెబుతున్నారు.

చివరకు ఉమాభారతి సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వమే సమర్ధవంతంగా వాదనలు వినిపించిందన్న సంకేతాలే వెళ్లాయి తప్ప - తాము పడిన కష్టం గురించి ఆ స్థాయిలో ప్రస్తావనకు రాకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ మీడియాలో కేసీఆర్ వాదనకు అనుకూలంగా వస్తే, తమ రాష్ట్ర మీడియాలో అది కనిపించలేదని, ఢిల్లీలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకోవడంలో తాము విఫలమయ్యామని అంటున్నారు. బాబుపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేస్తే కేసీఆర్ సర్ది చెప్పారని, సమావేశంలో ఏపి వాదనలు సమర్ధవంతంగా తిప్పికొట్టి ఉమాభారతికి విశ్వాసం కల్పించడంలో కేసీఆర్ సఫలమయ్యారన్న ప్రచారమే ఎక్కువ జరిగిందని గుర్తు చేస్తున్నారు.

అంతేకాకుండా ప్రాజెక్టులపై చంద్రబాబు సమక్షంలోనే ఎన్నికల ప్రచారం మోడీ మాట్లాడిన మాటల వీడియోలను కేసీఆర్ చూపించి చంద్రబాబు నోరు మూయించారన్న ప్రచారంపైనా మంత్రులు గుసగుసలాడుకుంటున్నారు. ఢిల్లీలో సరైన అధికారులను నియమించుకోకపోవడం, మీడియా మేనేజ్ మెంట్ లేకపోవడం, చంద్రబాబు స్వయంగా డిఫెన్సులో పడిపోవడం వల్లే దెబ్బతిన్నామని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/