Begin typing your search above and press return to search.

నాయకులే కరువు.. తూ.గోలో తుడుచుకుపోయిన టీడీపీ

By:  Tupaki Desk   |   18 March 2020 11:30 PM GMT
నాయకులే కరువు.. తూ.గోలో తుడుచుకుపోయిన టీడీపీ
X
అధికార పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత చంద్రబాబు తీరు తో పాటు భవిష్యత్ లో టీడీపీకి అవకాశం లేదనే భావనతో ఆ పార్టీలోని సీనియర్ నాయకులు మొదలుకుని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్సార్సీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ తుడుచుపెట్టుకపోతోంది ఆ పార్టీ. ఆ పార్టీకి తూర్పు గోదావరి జిల్లాలో నాయకులే కరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు తమ్ముళ్లు చెరో దారి చూసుకుంటున్నారు.వలసలతో టీడీపీ బేజారవుతోంది. ముఖ్యంగా ఈ వలసలు సాగుతున్న పార్టీ అధినేత బుజ్జగింపులకు చర్యలు తీసుకోకపోవడం, భవిష్యత్ పై ఆశలు కల్పించకపోవడం తో ఇక ఉన్నవారు కూడా వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు.

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. వలసలను ఆపడం తో పార్టీ అధిష్టానం ఘోరంగా విఫలమవుతుండడంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో పడ్డారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ జిల్లాలో తెలుగుదేశానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ కీలకంగా ఉన్నారు. అందుకే వీరిని త్రిమూర్తులుగా పేర్కొంటారు. ఈ ముగ్గురూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అధికారం దూరమయ్యాక వారు పార్టీని పట్టించుకోవడం మానేశారు. అప్పుడప్పుడు మీడియాలో కనిపించి కనుమరుగవుతారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కూడా పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. దీంతో జిల్లాలోని అన్ని నియోజకర్గాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింటోంది.

కాకినాడలో జ్యోతుల నెహ్రూ, పెద్దాపురంలో నిమ్మకాయల చిన్నరాజప్ప, అమలాపురంలో వీరికి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పార్టీలోని కీలక నాయకులుగా ఉన్న వారి పునాదులు కదిలించేలా వైఎస్సార్సీపీ వ్యూహం రచిస్తోంది. దీంతో పార్టీలోని రెండో స్థాయి నాయకులను జగన్ పార్టీ నాయకులు వలసను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తోట త్రిమూర్తులు వైఎస్సార్‌ సీపీలో చేరడంతో రామచంద్రపురంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కూడా వైఎస్సార్‌ సీపీలో చేరారు.

కాకినాడ రూరల్‌, తుని, రామచంద్రాపురం, రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీ వ్యూహం రచించి టీడీపీలోని నాయకులను ఆహ్వానిస్తోంది. టీడీపీలో రెండో నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొత్తపేట, జగ్గంపేటలో కూడా పార్టీకి జీవం పోసే నాయకులు లేరు. ఇప్పుడు ఎక్కడ వైఎస్సార్సీపీ పేరు మార్మోగుతోంది. జిల్లాలో జగన్ హవా కొనసాగిస్తున్నాడు. టీడీపీని నామమాత్రంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీలోనే నిలవలేకపోయింది. అందుకే దాదాపు 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయినట్టే. చంద్రబాబు, టీడీపీకి బైబై చెప్పేస్తున్నారు నాయకులు.