Begin typing your search above and press return to search.

మహానాడులో టీడీపీ నేతల ఫైట్! బయటపడ్డ విబేధాలు

By:  Tupaki Desk   |   29 May 2020 2:30 AM GMT
మహానాడులో టీడీపీ నేతల ఫైట్! బయటపడ్డ విబేధాలు
X
పార్టీ పండుగ మహానాడు వేదికగా తెలుగుదేశంలో విబేధాలు బయటపడ్డాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందే సీనియర్ నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రుల మధ్య పరోక్ష మాటల యుద్ధం సాగింది. అధికారం పోగానే కొంతమంది నేతలు పార్టీని వీడిపోయారని, వారిని తిరిగి చేర్చుకునేది లేదని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో లేకుంటే పార్టీని పట్టించుకోరా అని నిలదీశారు. చంద్రబాబు నేతల తీరును గమనించాలన్నారు.

చినరాజప్ప వ్యాఖ్యలపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ విబేధించారు. మైక్ పట్టుకొని మాట్లాడితే సరిపోదని, మొదట పార్టీ కేడర్‌కు నమ్మకం కలిగించాలని చెప్పారు. నాయకుని చుట్టూ ప్రదక్షిణ చేస్తే నాయకత్వం కాదన్నారు. చినరాజప్ప మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పదవులు రావడం అదృష్టం మీద ఆధారపడి ఉంటుందన్నారు.

తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరో తెలియని పరిస్థితి అని, తనకు తెలియకుండానే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాకు రాష్ట్ర కమిటీ నాయకులు వస్తే కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. మరికొందరు నేతల వ్యాఖ్యలు కూడా పార్టీలోని విబేధాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

చంద్రబాబు పక్కన ఉన్నవాళ్లు ఆయనను పక్కదోవ పట్టించారని శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ అన్నారు. అధినేతను కార్యకర్తలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను నేతలు విస్మరించారని చినరాజప్ప వ్యాఖ్యానించడం గమనార్హం.