Begin typing your search above and press return to search.

వైసీపీ గెలిచినా.. చ‌క్రం తిప్పుతోంది మాత్రం త‌మ్ముళ్లే..

By:  Tupaki Desk   |   26 Sept 2020 5:00 AM IST
వైసీపీ గెలిచినా.. చ‌క్రం తిప్పుతోంది మాత్రం త‌మ్ముళ్లే..
X
గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ భారీగా పుంజుకుని అధికారంలోకి వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ మిన‌హా.. 150 స్థానాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, వీటిలో 20 నుంచి 30 స్థానాల్లో టీడీపీ నేత‌లే చ‌క్రం తిప్పుతున్నార‌ని తెలుస్తోంది. అంటే.. వైసీపీ గెలిచిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టుసాధించ‌లేక పోతున్నార‌ని, దీంతో ఇప్ప‌టికీ టీడీపీ నేత‌ల హ‌వానే కొన‌సాగుతోంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రికొన్ని చోట్ల టీడీపీ-వైసీపీ నాయ‌కులు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు.

జిల్లాల వారీగా చూసుకుంటే.. కృష్ణాజిల్లా తిరువూరు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, నందిగామ‌, గుంటూరులో తెనాలి, వినుకొండ, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఉంగుటూరు, చిత్తూరులో శ్రీకాళహ‌స్తి, చిత్తూరు, అనంత‌పురంలో అనంత‌పురం అర్బ‌న్‌, తాడిప‌త్రి ఇలా క‌డ‌ప మిన‌హా ప్ర‌తి జిల్లాలోనూ వైసీపీ నేత‌లు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికీ టీడీపీ నేత‌లు పైచేయి సాధిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండ‌డం.. ఆ పార్టీకి ప్ల‌స్‌గా మారింది. అయితే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ సునామీ ప్ర‌భావం ఉంద‌ని, వాస్త‌వానికి మాకే బ‌లం ఉంద‌ని టీడీపీ నాయ‌కులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌ను స‌మ‌ర్ధంగా ఎదుర్కోవ‌డంలో వైసీపీ ఎమ్మెల్యేలు విఫ‌ల‌మ‌వుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉండడం, క‌రోనా నేప‌థ్యంలో ప‌నులు ముందుకు సాగ‌క‌పోవ‌డం వంటివి వారికి ప్ర‌తిబంధ‌కాలుగా మారితే.. టీడీపీ నాయ‌కుల‌కు మాత్రం ఈలోపాలే.. వ‌రాలుగా మారాయి. దీంతో వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పైగా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే..త‌మ‌దే విజ‌యం అంటూ టీడీపీ నాయ‌కులు స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో వైసీపీ నాయ‌కులు ఏం మాట్లాడితే.. ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుందోన‌ని జంకుతుండ‌డం కూడా టీడీపీకి వ‌రంగా మారింది. మొత్తానికి ఇలాంటి ఎమ్మెల్యేల‌కు స‌రైన స్థ‌యిర్యం క‌ల్పించ‌క‌పోతే.. మున్ముందు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు రాజ‌కీయ ప‌రిశీల‌కుల నుంచి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వైసీపీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.